ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్ అవుతోందా ? నిన్నటి వరకు విపక్ష వైసీపీ నుంచి టీడీపీలోకి పలువురు ప్రజాప్రతినిధులు జంప్ చేస్తుంటే ఇప్పుడు సీన్ రివర్స్ కొడుతోందా ? అంటే తాజా రాజకీయ పరిణామాలు, టీడీపీ ప్రజాప్రతినిధుల అసంతృప్తులు అవుననే ఆన్సర్లే ఇస్తున్నాయి. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ఎఫెక్ట్తో వైసీపీ నుంచి మొత్తం 29 మంది ప్రజాప్రతినిధులు సైకిలెక్కేశారు.
ఇప్పుడు టీడీపీ బండి ఓవర్లోడ్ అయ్యింది. ఇక్కడ కొత్తా, పాత నాయకుల మధ్య అస్సలు సఖ్యత ఉండడం లేదు. దీనికి తోడు టీడీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నవారు కొందరు ఉన్నారు. మంత్రి పదవులు కోల్పోయినవారు, మంత్రి పదవి రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న వారు, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని డిసైడ్ అయిన వారు తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసం ఇప్పటికే రాజకీయంగా కొత్తదారులు వెతుక్కునే పనిని ప్రారంభించినట్టు తెలుస్తోంది.
నంద్యాలలో సోదరుడు శిల్పా మోహన్రెడ్డి టీడీపీని వీడి వైసీపీలోకి జంప్ చేసేశారు. సోదరుడు పార్టీ మారినా తాను మాత్రం టీడీపీలోనే ఉంటానని, చంద్రబాబు తనను ఏకంగా రెండుసార్లు ఎమ్మెల్సీని చేశారని శిల్పా చక్రపాణిరెడ్డి ఎంత మొత్తుకుంటున్నా ఆయన్ను లోకల్ టీడీపీ వాళ్లు, పార్టీ అధిష్టానం ఆయన్ను అస్సలు నమ్మడం లేదు. ఉప ఎన్నిక ప్రచారంలో కూడా ఆయన్ను పక్కన పెట్టేశారు. దీంతో తీవ్ర మనస్థాపంతో ఉన్న ఆయన ఉప ఎన్నికకు ముందుగానే పచ్చ కండువా వదిలేసి వైసీపీ కండువా కప్పేసుకునేందుకు రెడీ అవుతోన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఉప ఎన్నిక వేళ టీడీపీకి పెద్ద షాకే.
ఇక ఏపీలో కీలకమైన గుంటూరు జిల్లా నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు చంద్రబాబుకే ఇంటిలిజెన్స్ నివేదికలు వెళ్లాయట. మాజీ మంత్రి రావెల కిషోర్బాబు ప్రస్థానమంతా కాంట్రవర్సీల మయమే. ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి అవ్వడం, కాంట్రవర్సీ కామెంట్లు చేయడం, సొంత పార్టీ నేతలను పక్కన పెట్టేయడం, ఆయన కుమారుల వ్యవహారాలు ఇలా ఎన్నో విషయాలు ఆయన మెడకు చుట్టుకోవడంతో ఆయన మంత్రి పదవి కోల్పోయారు. మంత్రి పదవి పోయాక కూడా ఎమ్మెల్యేగా ఆయన తీరు వివాదాస్పదంగానే ఉంది.
ఇక ఆయన వైసీపీ వాళ్లకు సాయం చేయడం, ఆ పార్టీ నాయకులతో టచ్లో ఉండడం, ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగకు సాయం చేశారన్న నివేదికలు బాబు వద్దకు చేరడంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వరని తేలిపోయింది. ఈ క్రమంలోనే ఆయన వైసీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారట.
ఇక అదే జిల్లాకు చెందిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల గత ఎన్నికల్లో రాయపాటి కోసం తన సిట్టింగ్ ఎంపీ సీటును వదులుకుని ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎంపీ సీటును వదులుకున్న ఆయన మంత్రి పదవి ఆశించారు. అయితే బాబు ఆయనకు ప్రక్షాళనలో కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఆయన మాట ఓ ఎమ్మెల్యేగా సొంత నియోజకవర్గంలోనే చెల్లుబాటు కావడం లేదు. మోదుగుల బావ ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి వైసీపీలో ఉన్నారు. దీంతో ఆయన ద్వారా మోదుగుల కూడా వైసీపీలోకి వెళ్లే ఏర్పాట్లలో ఉన్నారట. ఏదేమైనా వీరికి తోడు మరికొందరు కూడా వచ్చే ఎన్నికల వేళ టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీలోకి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.