అక్రమంగా తమ భూబాగంలోకి ప్రవేశించిన భారత్కు చెందిన ఇద్దరు భారతీయులను పాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.. పాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో విశాఖపట్టణానికి చెందిన ప్రశాంత్ కూడా ఒకరు. ఈ విషయంలో ఈ రోజు మీడియాతో అతడి తండ్రి బాబూరావు మాట్లాడారు.
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న తన కుమారుడు ప్రశాంత్.. ఓ అమ్మాయిని ప్రేమించాడని, అయితే, ప్రేమ విఫలమవ్వడంతో కుంగుబాటుకు గురైన కారణంగానే రాజస్థాన్ వెళ్లి పొరపాటున పాక్ లో అడుగుపెట్టాడని తెలిపారు.
ఇకపోతే పాక్ మీడియా మాత్రం ప్రశాంత్ అక్రమంగా ప్రవేశించాడని, పాక్ నుంచి యూరప్ వెళ్లే ప్రయత్నంలో పట్టుబడినట్టు పలు కథనాలను ప్రచురించడమే కాకుండా. తమ దేశంలోకి వీరు అక్రమంగా ప్రవేశించినట్లు ఆరోపణలు చేస్తూ అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక అరెస్ట్ చేసిన వారిలో మరొకరు మధ్యప్రదేశ్కు చెందిన దరీలాల్ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. వీరిలో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండటంతో భారత్ అతన్ని పంపించి ప్రత్యేక ఆపరేషన్కు పాకిస్తాన్లో కుట్ర పన్నిందని ఆదేశ మీడియా ఆరోపించింది.
అయితే ఇద్దరు భారతీయ యువకులను పాక్లో బందించడం పై నేడు భారత రక్షణ శాఖ సమావేశం కానుంది. అక్కడి అధికారులతో మాట్లాడి పరిస్థితిపై సమీక్షించనుంది. అంతే కాకుండా వీరికి ఎలాంటి హని తలపెట్ట వద్దని తక్షణమే భారత పౌరులను విడుదల చేయాలని భారత్ డిమాండ్ చేసింది.
ఇదే కాకుండా విచారణ పేరుతో వారిని చిత్రహింసలకు గురి చేస్తే సహించేది లేదని భారత్ పాక్ను హెచ్చరించింది.. ఇక ఇప్పటికే తమ అదుపులో ఉన్న వీరిని విచారిస్తున్నామని పాకిస్తాన్ చెప్పడంతో వీరి కుటుంబాల్లో ఆందోళన మొదలైంది.