దిశ రేపిస్టుల ఎన్‌ కౌంటర్ ఘటనపై తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎన్ కౌంటర్ వార్తను టీవీల ద్వారా తెలుసుకున్న సమీప గ్రామాల జనం పెద్ద ఎత్తున చటాన్‌పల్లి వంతెన వద్దకు తరలి వచ్చారు. దిశ రేప్ అండ్ మర్డర్ ఘటన జరిగినప్పటి నుంచి తీవ్ర ఆగ్రహంతో ఉన్న జనం ఎన్ కౌంటర్ తో శాంతిస్తున్నారు. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

ఎన్‌ కౌంటర్ ప్రాంతంలోని పోలీసులపై వంతెనపై నుంచి పూలు చల్లుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పోలీసులంటే సాధారణ జనానికి భయం కానీ కోపం కానీ ఉండటం చూస్తుంటాం. కానీ దిశ రేపిస్టుల ఎన్ కౌంటర్ తో జనం పోలీసులపై అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. జైజై పోలీస్ అంటూ గొంతెత్తి నినదిస్తున్న తీరు అపూర్వంగా ఉంది. తెలంగాణ పోలీస్‌ జిందాబాద్‌.. సాహో సజ్జనార్‌’ అంటూ నినాదాలు చేస్తున్నారు.

 

మరోవైపు డయల్‌ 100 నంబర్ కు కూడా జనం ఫోన్ చేసి పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు. దిశను పాశవికంగా అత్యాచారం చేసి చంపిన రేపిస్టులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై అంతటా హర్షం వ్యక్తమవుతోంది. అన్ని వర్గాల వారు పండుగ చేసుకుంటున్నారు. ఇక ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తమ సంతోషం పంచుకుంటున్నారు.

 

ఈ ఎన్ కౌంటర్ తో దిశ ఆత్మకు శాంతి చేకూరిందని జూనియర్ ఎన్టీఆర్ పోస్టు చేసారు. దిశ కుటుంబానికి న్యాయం జరిగింది, నిందితులను చంపిన బుల్లెట్ దాచుకోవాలని ఉందంటూ మంచు మనోజ్ స్పందించారు. ఇక దిశకు తగిన న్యాయం జరిగిందని అక్కినేని నాగార్జున అభిప్రాయపడ్డారు. ఇక మరో హీరో నాని .. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. వాడు పోలీసోడై ఉండాలి అంటూ పోస్టు పెట్టారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: