పరిపాలనలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్న వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...తన నిర్ణయాలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలన రాజకీయవేత్తగా నిలుస్తున్న వైసీపీ అధినేత తీసుకున్న అనేక నిర్ణయాల్లో ... తాజాగా హాట్ టాపిక్గా మారింది దిశ చట్టం. మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా..నిర్దారించే ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ దిశ యాక్ట్-2019ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చట్టానికి అనేక ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా, ఏకంగా ఓ రాష్ట్రం ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రకటించింది.
ఇటీవలే కొలువుదీరిన మహారాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం మాదిరిగా కఠిన చట్టం తీసుకువారాలనే యోచనలో ఉంది. మహిళలపై జరిగే క్రూరమైన నేరాల్లో సత్వర న్యాయం అందించేందుకు ఏపీ దిశ యాక్ట్ మాదిరిగా చట్టాన్ని తీసుకొచ్చే అంశంపై ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తుందని హోంమంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల పట్ల ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో మహిళలు, అమ్మాయిలు ఎలాంటి భయం లేకుండా జీవించాలనేదే తమ అభిమతమని ఏక్నాథ్ షిండే అన్నారు. చిన్నారులపై జరుగుతున్న నేరాల్లో విచారణ కోసం 25 ప్రత్యేక కోర్టులు, 27 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటయ్యాయి. సైబర్ నేరాలపై విచారించేందుకు 43 పోలీస్స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే 2 నెలల్లో సైబర్ క్రైం డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న 164 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
కాగా ఇప్పటికే దిశ చట్టాన్ని వెంటనే దేశమంతా అమల్లోకి తెవాలని ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) అధ్యక్షురాలు స్వాతి మలివాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తెలంగాణలో దిశ హత్యాచార ఘటనను ఖండిస్తూ డిసెంబర్ 3న స్వాతి మలివాల్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు . నేరం జరిగిన ఆరు నెలల్లో రేపిస్టులకు ఉరిశిక్ష పడేలా చెయ్యాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే, దీనిపై కేంద్రం స్పందించలేదు. మరోవైపు ఏపీలో దిశ చట్టంలో రేపిస్టులకు 21 రోజుల్లో శిక్ష పడేలా రూల్ ఉండటంతో... ఆ చట్టాన్ని దేశమంతా అమలు చెయ్యాలని కోరారు.