రోజుకు వేలల్లో రిజిస్టేషన్లు.. కోట్లల్లో ఆదాయం... కరోనా దెబ్బకు పరిస్థితులు తారుమారు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయిన రిజిస్ట్రేషన్ రంగం కుదేలు అయింది. రిజిస్టేషన్లు లేక ఆదాయం భారీగా పడిపోయింది. దీనికి తోడు లాక్డౌన్ ఎత్తేసిన తరువాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరుగుతాయన్న వార్తలు రియల్టర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
నిత్యం వందలాది మంది కస్టమర్లతో వేలాది రిజిస్ట్రేషన్లు చేస్తూ కిటకిటలాడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెల బోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా మార్చి 22 నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రజలు ఎవరూ ఇల్లు వదిలి బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో భూములు, ఇండ్లు, పెళ్లిళ్ల డాక్యుమెంటేషన్ కోసం ప్రజలు ఎవరు రిజిస్ట్రార్ ఆఫీసులకు రావడం లేదు. గతంలో అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకున్న రిజిస్ట్రేషన్ లో, ఇతర పద్దతిలో ఆగిపోయిన డాక్యుమెంటేషన్ లో ఇప్పుడు జరుగుతున్నాయి.
రోజుకు వేలల్లో జరగాల్సిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు కేవలం పది లోపే అవుతున్నాయి. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆశించిన మేర ఆదాయం రావడం కష్టంగా మారింది. నష్టాల నుంచి బయట పడటానికి లాక్డౌన్ సడలింపు అనంతరం రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరుగుతాయని ప్రభుత్వవర్గాలు చెప్పకనే చెబుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు బోసిపోయాయి. రోజంతా చూసినా 10 నుంచి 15 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్ అవుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను అత్యవసర సేవల కింద గుర్తించారు. తెలంగాణలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. సాధారణ రోజుల్లో ఈ కార్యాలయాల ద్వారా రోజుకు 6000 నుంచి 7000 డాకుమెంట్లు రిజిస్టర్ అయ్యేవి. ప్రతి రోజు సుమారు 30 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది. భూములు, స్థలాలు, ఫ్లాట్ల కొనుగోలుదారులు కార్యాలయాలకు రావట్లేదు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి బ్యాంకుల్లో చలాన్లు కట్టి, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రావాల్సి ఉంటుంది. లాక్డౌన్తో వినియోగదారులు చలాన్లు కట్టలేకపోతున్నారు. పైగా డాక్యుమెంట్లను తయారు చేసే రైటర్లు కార్యాలయాల వద్దకు రావట్లేదు.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో రూ.6,700 కోట్ల రాబడని అంచనా
సెప్టెంబరు బడ్జెట్లో రూ.6,146కు రాబడి కుదింపు
2020-21 బడ్జెట్లో రూ.10 వేల కోట్ల రాబడని అంచనా
వాయిస్ 4 : 2019-20 ఆర్థిక సంవత్సరపు ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 6,700 కోట్ల రాబడిని ప్రభుత్వం అంచనా వేసింది. సెప్టెంబరులో ప్రవేశపెట్టిన~బడ్జెట్లో రిజిస్ట్రేషన్ల రాబడిని 6 వేల146 కోట్లకు కుదించింది. అయితే 2020 - 21 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్లో మాత్రం రిజిస్ట్రేషన్ల ద్వారా 10 వేల కోట్ల రాబడిని అంచనా వేసింది తెలంగాణ ప్రభుత్వం.
లాక్ డౌన్ సడలించిన తరువాత సుమారు ఆరు నెలల పాటు పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఎప్పట్నుంచో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని భావిస్తోంది. దింతో పరిస్థితులు చక్క బడిన తరువాత రిజిస్ట్రేషన్ల పన్నులు భారీగానే పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి రాబట్టేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.