కరోనా సెకండ్‌వేవ్‌తో భారత్ కుదేలైంది. రోజూ నాలుగైదు వేల మంది వరకూ చనిపోయారు. ఆక్సిజన్ కోసం కరోనా రోగులు అల్లల్లాడిపోయారు. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క నరకం అనుభవించారు. చాలామంది అయిన వాళ్ల ఆర్తనాదాల మధ్యే కన్నుమూశారు. ఇలాంటి సమయంలో భారత్‌కు సాయం చేసేందుకు అనేక దేశాలు ప్రయత్నించాయి. మరికొన్ని అంతర్జాతీయ స్వచ్చంధ సంస్థలు కూడా భారత్‌కోసం విరాళాలు సేకరించి ఆదుకున్నాయి.


అయితే ఇలా విరాళాల ముసుగులో ఓ పాకిస్తాన్ సంస్థ చేసిన అరాచకం తాజాగా వెలుగు చూసింది. అమెరికాలో ఉన్న ఓ పాకిస్థాన్‌ ఛారిటీ సంస్థ నీచానికి ఒడిగట్టింది. భారత్‌ కోసమని విరాళాలు సేకరించి పాక్ టెర్రరిస్టు సంస్థలకు, సైన్యానికి అందించినట్టు డిస్‌ఇన్‌ఫో ల్యాబ్‌ సంస్థ తెలిపింది. హెల్పింగ్‌ ఇండియా బ్రీత్ పేరుతో  ఈ పాక్ సంస్థ భారీగా నిధులు సమీకరించి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ మొత్తం స్కామ్ వ్యవహారాన్ని డిస్‌ఇన్‌ఫో ల్యాబ్‌ సంస్థ కొవిడ్ స్కామ్ 2021గా అభివర్ణించింది. భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన వేల మంది డ‌బ్బును పాక్ కు తరలించింది ఈ దగాకోరు సంస్థ.


వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్ నుంచి అమెరికాలో న‌డిచే స్వచ్ఛంద సంస్థలు ఏప్రిల్ 27, 28 తేదీల్లో అమెరికాలో అనేక విరాళ‌ సేక‌ర‌ణ సంస్థల‌ను ఏర్పాటు చేశాయట. వీటిలో ఇమానా ఇస్లామిక్ మెడిక‌ల్ అసోసియేష‌న్ ఆఫ్ నార్త్ అమెరికా అనే సంస్థ సోషల్ మీడియా ద్వారా భారీగా విరాళాలు సేకరించిందట. భారీగా డబ్బు సమీకరించిన ఈ సంస్థ నిధులు ఏం చేసిందన్నదానిపై సమాచారం ఇవ్వడం లేదు.


డిస్‌ఇన్‌ఫో ల్యాబ్‌ నివేదిక ప్రకారం ఈ సంస్థ అన్ని సోషల్ మీడియా వేదికల ద్వారా సుమారు 150 కోట్ల రూపాయల విరాళాలు సేకరించిందట. అందులో కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే ఇండియాకు పంపినట్టు చెబుతోంది. మిగిలిన సొమ్ముకు లెక్కలు లేవు. ఈ సొమ్మంతా పాక్ ఉగ్ర సంస్థలకు, పాక్ సైన్యానికి అందించినట్టు డిస్‌ ఇన్ఫో ల్యాబ్ చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: