ఇప్పుడు ఈ వీఐపీ భద్రత విషయంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వీఐపీ భద్రత విషయంలో మహిళా కమాండోలను కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ సీఆర్పీఎఫ్ కు చెందిన పురుష కమాండోలు మాత్రమే వీఐపీ సెక్యూరిటీలో పాలుపంచుకుంటున్నారు. వీఐపీలకు భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్లో మహిళా కమాండో సేవలు కూడా వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు గతంలోనే చర్యలు చేపట్టింది. వీటి ఫలితంగా వీఐపీల భద్రత కోసమే ప్రత్యేకంగా 32 మందితో సీఆర్పీఎఫ్ ఒక దళాన్ని ఏర్పాటు చేసింది.
కొత్తగా ఏర్పాటు చేసిన మహిళా దళం రక్షణ పరిధిలోకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మరోనేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా వస్తున్నారు. ఇప్పుడు వీరి భద్రత సిబ్బందిలో మహిళలు కూడా ఉంటున్నారు. జడ్ ప్లస్ రక్షణలో ఉన్న వీవీఐపీల్లో ఉన్న ఇతర మహిళా నేతల రక్షణలో కూడా మహిళా సిబ్బందిని కేటాయించింది సీఆర్పీఎఫ్. వీఐపీల నివాసాల వద్ద భద్రత, ఎన్నికల రాష్ట్రాలలో ప్రత్యేక సేవల కోసం మహిళా సిబ్బందిని వినియోగించాలని సీఆర్పీఎఫ్ నిర్ణయించింది.
జడ్ ప్లస్ భద్రతలో ప్రస్తుతం 5గురు వీఐపీలకు భద్రత కల్పిస్తున్నట్లు సీఆర్పీఎఫ్ వర్గాలు చెబుతున్నాయి. జడ్ కేటగిరీ భద్రతలోని 12 మంది వీవీఐపీలకు సీఆర్పీఎఫ్ సేవలు అందిస్తోంది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భద్రత కోసం కూడా త్వరలో మహిళా కమాండోలు రాబోతున్నారట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి