బాబు రాజెంద్ర ప్రసాద్ టాలీవుడ్ కు పెట్టిన కుంపటి ఇంకా రగుల్తూనే ఉంది. ఎతికెతికి కోరి కెలుక్కున్నట్లు వుంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఆ పార్టీ నాయకులు సినిమా జనాలను రెచ్చగొట్టారు. మీరేం హీరోలు, ఏజ్-బార్ హీరోలు, మీరేం గొప్ప, తమిళనాడ్ హీరోలతో పోల్చి, జల్లి కట్టుకు వారి స్పందన గురించి, మాట్లాడిన వాళ్లు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడరేం? అంటూ. అంతటితో ఊరు కోకుండా గట్టిగానే నోరు పారేసుకున్నారు.ఆడవాళ్ళ అందాలు, జఘనాలు అంటూ దూల మాటలు మాట్లాడారు. గట్టి విమర్శలే చేసారు.
దీంతో సినిమా జనాల నుంచి ఇంకో రకమైన ప్రతిస్పందన వస్తోంది. ప్రత్యేక హోదా మీద మాట్లాడడం పోయి, రివర్స్ అవుతున్నారు. నిన్నటికి నిన్న కత్తి మహేష్ దులుపు దులిపారు. ఉదయం పోసాని కృష్ణ మురళి టిడిపి మొత్తాన్ని తూర్పారబట్టారు. అంతా మీ హీరోలే కదా? మళ్లీ ఇలా ఎందుకు అడగడం? అవార్డులు ఇచ్చుకున్నారు కదా? ఇప్పుడు మళ్లీ ఇలా అంటారేం? ఆ నందులు పొందిన వారి నెందుకు అడగరు? అనే టైపులో చురుక్కుమనేలా చరుకలు అంటించారు.
ఇప్పుడు తరువాత ఎపిసోడ్ తమ్మారెడ్డి భరద్వాజ తీసుకున్నారు. అందాలను ఆరబోయించి, తైతక్కలాడే హీరోలు మీ పక్కనే వున్నారు కదా? వాళ్లకు చెప్పండి హోదా మీద మాట్లాడమని అంటూ చురకేసారు. అవార్డులు పంచినపుడు మీకు సినిమా జనాలు అందరూ కనిపించలేదా? ఇప్పుడు కావాల్సి వచ్చిందా? అని కూడా స్ట్రయిట్ గా అడిగేసారు.
ఎప్పుడైతే ఇలాంటి రియాక్షన్ సినిమా వాళ్ల దగ్గర నుంచి వచ్చిందో, ఇక మళ్లీ సినిమా జనాలను హోదా మీద మాట్లాడమనే ధైర్యం తెలుగుదేశం జనాలు చేయక పోవచ్చు. ఎమెల్సి రాజెంద్రసాదుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కలిపి ఆయన ఒకటే సమాధానం దిమ్మదిరిగే లాగా ఇచ్చారు. తాము నంది అవార్డులు తీసుకోలేదు కాని మీరు (టిడిపి సంభందీకులు) పంచుకున్నారని తమ్మారెడ్డి భరద్వాజ ఆరోపించారు.
నంది అవార్డులు తీసుకున్నపుడు గొడవ చేశామన్నారు కదా! ఆ నంది అవార్డు కమిటీలు వేసింది కూడా మీరే కదా చంద్రబాబు నాయుడు గారూ! అని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తమరు పంచిన నంది అవార్డులు తీసుకున్న టాలీవుడ్ ప్రముఖులు ఈ విషయంపై ఎందుకు స్పందించరు? అని అడిగారు. ఆడవాళ్ల అందాలతో సినిమా తీసేవాళ్లు తమరి పక్కనే ఉన్నారు కదా! వారెందుకు హోదా కోసం పోరాడరు? అని ప్రశ్నించారు. తాము ఏసీల్లో కులుకుతున్నామా? మరి మీ టీడీపీ నాయకులు లంచాలు తిని ఏసీ ల్లో కులకట్లేదా? ధ్వజమెత్తారు.
అసలు హోదా కన్నా "పవన్-జగన్-మోడీ" ఎక్కడ కలిసిపోతారో అన్న భయమే ఎక్కువగా వుందని తమ్మారెడ్డి నేరుగా అనడం అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. హోదా సాధ్యంకాదని మోడీ చెప్పాక, గమ్మున ఊరుకున్న చంద్రబాబు ఇఫ్పుడు మళ్లీ హొదా గురించి గొంతెత్తడం వెనుక వైనం ఇదికాక మరేంటని నిలదీసారు.
తాము అంటే టాలీవుడ్ జనం రాత్రి, పగలు కష్టపడితేనే పది మందికి అన్నం దొరుకుతున్నదని తెలియజేశారు. తమరికి ప్రత్యేక హోదా విషయం కంటే "జగన్-మోదీ-పవన్" ఎక్కడ జతకడతారో? "ట్రయాంగులార్ ఫైట్" మొదలవుద్దేమోనని కంపరం పుట్టినట్లు అర్ధమౌతుంది. ఆ విషయం భయపెడుతుంది కాదా? అందుకే సినిమా వాళ్ల మీద లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
ప్రత్యేక హోదా 100% సాధ్యం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడో చెప్పారు కానీ అప్పటి నుంచీ మీరు మౌనంగా ఉండి ఇప్పుడెందుకు అకస్మాత్తుగా నిద్ర లేచి ఉలిక్కి పడుతున్నారెందుకు? అసలు ఈ విషయం చంద్రబాబు నాయుడికి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది? అని సూటిగా అడిగారు. సినిమా వాళ్ల భార్యల గురించి అసభ్యంగా మాట్లాడినపుడు మాట్లాడని వారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? అని గట్టిగా ప్రశ్నించారు.