ఏపీలో కుల రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పుడే అంతలా కనిపించకపోయినా.. అంతర్గతంగా అన్ని పార్టీలు వీటిపై దృష్టిసారించాయి. ఒక్కో పార్టీకి ఒక్కో కులానికి అండగా నిలుస్తూ వస్తున్న విషయం జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో తటస్థంగా వ్యవహరించే కొన్ని సామాజికవర్గాలపై అధికార టీడీపీ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం టీడీపీపై బ్రాహ్మణుల్లోని కొన్ని వర్గాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. అదే సామాజికవర్గానికి చెందిన మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల విషయంలో ప్రభుత్వ వైఖరి, ప్రధాన అర్చకుడు రమణదీక్షితులపై మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యలు దుమారమే రేపాయి. మరోపక్క అర్చకులకు రిటైర్మెంట్ వయసు నిర్ధారించడంపైనా తీవ్ర చర్చ జరుగుతోంది. ఫలితంగా టీడీపీ ఇరుకున పడిపోయింది. ఈ నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకు.. టీడీపీ అధిష్ఠానం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుందని సమాచారం.
2014 ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలిచిన కొన్ని వర్గాలు.. ఇప్పుడు అసంతృప్తితో ఉన్నాయనే చర్చ ఏపీలో జోరందుకుంది. ముఖ్యంగా బ్రాహ్మణులు, వైశ్యులు ఆ పార్టీకి క్రమంగా దూరమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దూరమవుతున్న వివిధ కులాలను దరి చేర్చుకోవడానికి టీడీపీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, తిరుమల ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు, చిలకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సౌందర్యరాజన్ల వల్ల బ్రాహ్మణ వర్గం దూరమైందన్న భావన పార్టీ వర్గాల్లోనూ, కొంత మంది టీడీపీని అభిమానించే బ్రాహ్మణుల్లో నెలకొంది. బ్రాహ్మణుల కోసం 'బ్రాహ్మణ కార్పొరేషన్' ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులు, యువకులకు ప్రభుత్వం సహాయం చేస్తున్నా ఆ పార్టీపై బ్రాహ్మణ వర్గాల్లో ఆగ్రహం నెలకొందన్న ప్రచారం జరుగుతోంది.
దీనిని తగ్గించేందుకు కుల సమీకరణలు ప్రకారం, జనాభా దామాషా ప్రకారం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాలన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. కొన్నేళ్లుగా బ్రాహ్మణ వర్గానికి పోటీ చేసే అవకాశం కల్పించడం లేదన్న విమర్శ ఉంది. దీంతో..రాబోయే ఎన్నికల్లో...టిడిపి..ఆ వర్గానికి పోటీ చేసే అవకాశం ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో రాజకీయ చైతన్యం అధికంగా గల గుంటూరు జిల్లాలో బ్రాహ్మణ సామాజికవర్గానికి పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆ సామాజికవర్గం కోరుతోంది. తమ సామాజికవర్గం అధికంగా ఉన్న గుంటూరు-2 నియోజకవర్గంలో టీడీపీ టిక్కెట్ ఇస్తే బాగుంటుందని దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులను పార్టీ ఆకర్షించడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ ఈ వర్గానికి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని.. ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఒకరికి పోటీ చేసే అవకాశం ఇస్తే ఆయన గెలిచారని గుర్తుచేస్తున్నారు.
గుంటూరు-2 టిక్కెట్ను బ్రాహ్మణులకు కేటాయిస్తే ఇక్కడి నుంచి టీడీపీ విజయం సాధిస్తుందని ఆ వర్గానికి చెందిన నేతలు చెబుతున్నారు. ఇక్కడ దాదాపు 25వేల బ్రాహ్మణుల ఓట్లు ఉన్నాయని..ఈ ఓట్లతో పాటు.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లలో అధికశాతం టీడీపీ వైపు పోల్ అవుతాయని భావిస్తున్నారట. ఇదే సమయంలో నియోజకవర్గంలోని బీసీ సామాజికవర్గం ఓట్ల దన్నుతో విజయం తథ్యమని, దీని ప్రభావం పక్కనే ఉన్న గుంటూరు-1, విజయవాడ వెస్ట్పై కూడా ప్రభావం చూపుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడి నుంచి ఆ వర్గానికి చెందిన ప్రముఖునికి టిక్కెటు ఇస్తే బాగుంటుందనే సూచనలు ఆ సామాజికవర్గం నుంచి ప్రముఖంగా వస్తున్నాయి.