తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్లు ఒకొక్కరుగా తనువు చాలించడం ఆ పార్టీకి కోలుకోలేని నష్టాన్ని చేకూరుస్తోంది . పార్టీ వ్యవస్థాపక నేతల్లో పలువురు రోడ్డు ప్రమాదంలో మరణించిగా, ప్రస్తుతం కోడెల లాంటి వారు అర్ధాంతరంగా తనువు చాలించారు. టీడీపీ మూల స్తంభాలుగా నిలిచిన పలువురు సీనియర్ నేతలు ఒక్కొక్కరు తనువు చాలిస్తుండడం తో , ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒంటరైనట్లు కనిపిస్తున్నారు . తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీఆర్ పిలుపు మేరకు తాము అప్పటి వరకు చేస్తున్న వృత్తిని విడిచి రాజకీయాల్లో చేరిన వారు, కాంగ్రెస్ నుంచి టిడిపి లోకి వచ్చిన వారు గెలుపోటములతో సంబంధం లేకుండా, తమ ప్రాంతం లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేశారు .
ఈ క్రమం లో వారు కూడా పార్టీలో ఉన్నత స్థాయి చేరుకున్నారు . ఇలా ఉన్నతస్థాయి కి చేరుకున్న నేతలంతా ఒక్కొక్కరుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం యాదృచ్ఛికమే అయినా, తెలుగుదేశం పార్టీకి మాత్రం తీరని లోటు ను మిగిల్చిందని చెప్పాలి . తెలుగుదేశం పార్టీ సీనియర్లలో మాధవ రెడ్డి నుంచి మొదలుకుని , దేవినేని వెంకటరమణ , ధూళిపాల వీరయ్య చౌదరి, బాలయోగి, లాల్ జాన్ బాషా, ఎర్రన్నాయుడు , నందమూరి హరికృష్ణ ...తాజాగా కోడెల శివ ప్రసాదరావు , ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు నేతలు రోడ్డు ప్రమాదాల్లో మరణించగా , విధి వక్రీకరించి ప్రమాదవశాత్తు చనిపోయినవారు పలువురు ఉన్నారు .
ఇలా అర్ధాంతరంగా తనువు చాలించిన నేతలంతా తమ జిల్లాలో, లేదంటే తమ ప్రాంతం లో పార్టీకి బలమైన నాయకులుగా వ్యవహరిస్తూ, రాజకీయాలను శాసించినవారే కావడం విశేషం . పార్టీ సీనియర్లు ఒకొక్కరు తనువు చాలిస్తున్న ప్రతిసారి , ఆ ప్రాంతం లో టీడీపీ కి కోలుకోలేని దెబ్బ తగులుతోందన్నది నిర్వివాదాంశమేనని ఆ పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి . ఇక వయస్సు మీద పడిన చంద్రబాబు , తన సమకాలీకుల మరణం తో ఒంటరివారు అవుతున్నట్లు కన్పిస్తోందని అంటున్నారు .