భారతీయ చలనచిత్ర రంగంలో విశ్వనటుడుగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వరూపం 2’ ట్రైలర్ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ‘విశ్వరూపం’ చిత్రానికి సీక్వెల్గా రూపొందిన ఈ చిత్రం పలు అవాంతరాల కారణంగా కొన్నేళ్లుగా ఆలస్యం అవుతూనే ఉంది. గతంలో వచ్చిన విశ్వరూపం ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
తాజాగా విశ్వరూపం 2 కూడా కొంత కాలం సమస్యల వలయంలో చిక్కుకుంది. మొత్తానికి అన్ని అవరోధాలు అధిగమించి ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. కాగా నేడు ‘విశ్వరూపం2 ’ ట్రైలర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంచ్ చేశారు. విశ్వరూపం 2 ట్రైలర్ చూస్తుంటే..దేశ భక్తికి సంబంధించిన చిత్రంగా కనిపిస్తుంది. అంతే కాదు హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీన్లు కనిపిస్తున్నాయి.
ప్రయోగాలకు పెద్ద పీట వేసే కమల్ హాసన్ చాలా రిస్కీ సీన్లు షూట్ చేసినట్లు కనిపిస్తుంది. ‘ఏ మతానికో కట్టుబడటం తప్పు కాదు బ్రదర్! కానీ, దేశ ద్రోహం తప్పు.’ అంటూ విశ్వరూపంతో గట్టి మెసేజ్ ఇవ్వబోతున్నారు కమల్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదలైన ‘విశ్వరూపం 2’ ట్రైలర్ను హిందీ వర్షన్లో అమీర్ ఖాన్, తమిళ వర్షన్లో శృతి హాసన్, తెలుగు వర్షన్లో ఎన్టీఆర్ విడుదల చేశారు.
రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు ఆండ్రియా, నాజర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గిబ్రాన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం యూఎస్లో పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ని కంప్లీట్ చేసుకుని ఆగష్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.