కరోనా సెకండ్ వేవ్ తర్వాత యువ హీరోలంతా తమ సినిమాల విషయంలో వేగం పెంచేశారు.ఇక వారికి ధీటుగా మెగాస్టార్ చిరంజీవి సైతం ఇప్పుడు వరుస షూటింగ్స్ తో బిజీ కానున్నాడు. మెగాస్టార్, చరణ్ లు కలిసి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టనుంది చిత్ర యూనిట్.కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్స్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది.ఇక ఈ సినిమాకి ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సిఉండగా.. అంతలోనే లూసిఫర్ రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు చిరు. ఈ సినిమా షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం.

వచ్చే నెల ఆగస్టు 12 వ తేదీ నుంచి లూసిఫర్ రీమేక్ షూటింగ్ మొదలు కానుంది.ఈ రీమేక్ ని దర్శకత్వం వహిస్తున్న మోహన్ రాజా ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.ఇక ఇప్పటికే ఈ సినిమాలో నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.కానీ అందులో ఇంకా నిజ నిజాలు తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా కోసం ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ ఓ భారీ సెట్ ను రెడీ చేసాడు.ఇప్పటికే  సెట్ పనులు మొదలయ్యాయి.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమాతో పాటుగా మరో కొత్త ప్రాజెక్ట్ ను సైతం మొదలుపెట్టాలని అనుకుంటున్నాడట మెగాస్టార్.అయితే ఆ కొత్త ప్రాజెక్ట్ మరేదో కాదు పవర్, జై లవకుశ, వెంకీ మామా సినిమాల దర్శకుడు కే. ఎస్. రవీంద్ర(బాబీ) తో చిరు చేయబోతున్న సినిమా అని సమాచారం.ఇటీవలే బాబీ మెగాస్టార్ ని కలిసి ఓ మాస్ కథని వినిపించగా అది చిరంజీవికి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడు.ఇక లూసిఫర్ రీమేక్ తో పాటు ఈ సినిమా కూడా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: