ఎంపీల కోసం పార్లమెంటులో ‘దంగల్’..
ఎంపీల కోసం పార్లమెంటులో హిందీ చిత్రం ‘దంగల్’ను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. గురువారం సాయంత్రం పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియంలో ఈ చిత్ర ప్రదర్శన జరుగుతుందని ఎంపీలందరికీ సమాచారం అందింది. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చొరవతో ఈ చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఉభయ సభల సమావేశాల అనంతరం గురువారం సాయంత్రం 6.30 గంటలకు చిత్ర ప్రదర్శన ఉంటుందని లోక్ సభ ప్రధాన కార్యదర్శి అనూప్ మిశ్రా తెలిపారు.
ఇది చిన్న పిల్లల బడి కాదు : సుమిత్ర మహాజన్
లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ సభ్యులపై ఆగ్రహం ప్రదర్శించారు.. ప్రశ్నోత్తరాల సమయం పూర్తి కాగానే చాలా మంది సభ్యులు ఒకరితో మరొకరు మాట్లాడుకుంటూ కనిపించారు. దీంతో అంతా చిన్న పిల్లలు అల్లరి చేస్తున్న వాతావరణం ఏర్పడింది. దీనిని గమనించిన సుమిత్ర మహాజన్ మండిపడ్డారు. ‘‘ఏం జరుగుతోంది? ఇదేమైనా చిన్న పిల్లల బడి అనుకుంటున్నారా?’’ అని గద్దించారు.
మహారాష్ట్రలో 19మంది ఎమ్మెల్యేలపై వేటు..
మహారాష్ట్ర అసెంబ్లీలో 19 మంది ప్రతిపక్ష శాసనసభ్యులపై వేటు పడింది. బడ్జెట్ సమయంలో అనుచితంగా ప్రవర్తించినందుకు వారిని తొమ్మిది నెలల పాటు సస్పెండ్ చేశారు. మార్చి 18న మహారాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి సుధీర్ ముంగటివార్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడమేగాక.. స్పీకర్ను అగౌరవ పరిచేలా ప్రవర్తించాయి. అంతేగాక.. ప్రసంగం అనంతరం ప్రతిపక్షాలకు ఇచ్చిన బడ్జెట్ ప్రతులను అసెంబ్లీ బయట దహనం చేశారు.
బీజేపీలో చేరిన ఎస్ఎం కృష్ణ..
కేంద్రమాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ భారతీయ జనతా పార్టీలో చేరారు. కర్ణాటకకు చెందిన ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరుతారని గతకొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఈ రోజు (బుధవారం) తెరదించారు. ఆయన ఈ రోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా నేతృత్వంలో ఆ పార్టీలో చేరారు. ఎస్ఎం కృష్ణ గతంలో కర్నాటక ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పని చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎం కృష్ణ మాట్లాడారు.
దావూద్ కీలక అనుచరుడు అరెస్టు...
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్కు చెందిన కీలక గ్యాంగ్స్టర్ దావూద్ లాలా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్టు చేసింది. అహ్మదాబాద్లోని జుహాపురా ఏరియాలో అతడిని అదుపులోకి తీసుకుంది. గుజరాత్లో ఓ హత్య కేసుకు సంబంధించి ఎప్పటి నుంచో పోలీసులు లాలా కోసం వెతుకుతున్నారు. అంతేకాకుండా రాజస్థాన్లోని పలు కీలక నేరాల్లో అతడి చేయి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.