ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు బలహీన వర్గాలంటే విపరీతమైన కోపం అంటూ మండిపడ్డారు. చంద్రబాబు బలహీనవర్గాల ద్రోహి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు టీడీపీ శనిలా దాపురించింది.. అంటూ మండిపడ్డారు. మరి బొత్స ఇంతగా రెచ్చిపోయి విమర్శించడానికి కారణం ఏంటంటారా..? స్థానిక సంస్థల ఎన్నికల్లో 59 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడమే.
ఈ విషయంలో కోర్టుకు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ద్రోహిగా మిగిలిపోయాడని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ స్ఫూర్తితో సమాజంలో వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి కోసం సీఎం వైయస్ జగన్ ముందుకు వెళ్తున్నారన్నారు. బడుగు, బలహీనవర్గాల మేలు కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి చంద్రబాబు అడ్డుతగులుతున్నాడన్నారు. బీసీలంటే చంద్రబాబుకు చులకన భావం అని, ఇన్నేళ్లు అధికారం ఇచ్చిన బీసీలకు చంద్రబాబు ఇచ్చే బహుమానం ఇదేనా అని ప్రశ్నించారు. బలహీనవర్గాలు తెలుగుదేశం పార్టీని ఎప్పటికీ క్షమించరని, చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడన్నారు.
అమరావతిలో బలహీనవర్గాలకు 1251 ఎకరం ఇస్తామని చెప్పాం.. దానికి కూడా చంద్రబాబుకు కడుపుమంట. సీఆర్డీఏ చట్టం ప్రకారం 5 శాతం బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇవ్వాలని ఉంది. అమరావతి ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండకూడదా..? దీనిపై జనాభా పరమైన సామాజిక సమతూల్యం దెబ్బతింటుందని చంద్రబాబు వాదిస్తున్నాడు. ఎక్కువమంది బీసీలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతూల్యం దెబ్బతింటుందా..? ఏరకంగా నీ వర్గం కోసం పాటుపడుతున్నావో తేటతెల్లమైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించాలని సీఎం ముందుకు వెళ్తుంటే.. ప్రతీదానికి అడ్డుపడుతున్నాడు.. అంటూ విమర్శించారు మంత్రి బొత్స.
వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని అన్ని పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని, మార్కెట్ కమిటీలు, దేవాలయ ట్రస్టు బోర్డుల్లో, నామినేటెడ్ కార్పొరేషన్లో, స్టాండింగ్ కౌన్సిల్, యూనివర్సిటీల్లో ఈసీ నియామకాల్లో కూడా 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో మార్కెట్ కమిటీ మంత్రిగా చేశాను.. 300 మార్కెట్ కమిటీలు ఉంటే.. వాటిల్లో చైర్మన్లుగా ఇద్దరు మహిళలు, నలుగురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ముగ్గురు మైనార్టీలు ఉండేవారు. ఇవాళ 216 మార్కెట్ కమిటీలకు 50 శాతం మంది చైర్మన్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైయస్ జగన్ అవకాశం కల్పించారని మంత్రి బొత్స గుర్తు చేశారు.