దుబాయ్ అంటే ఆకాశహర్మ్యాలు...! అందమైన బీచ్లే కాదు..! అంతకు మించి ఆంక్షలు, నిర్భందాలు కూడా..! అరబ్షేక్ల నిరంకుశ పాలన..! స్త్రీజాతంటే లెక్కలేనితనం...! మితిమీరిన వేధింపులు ఎక్కువే. ఈ రాచరిక పాలనతో విసిగిపోయిన ఆదేశ యువరాణి...స్వేచ్ఛను వెతుక్కుంటూ వెళ్లిపోయింది. ప్రాణాలకు తెగించి...ఇంటి నుంచి పారిపోయింది. మరికొద్ది గంటల్లో భారత భూభాగంలో అడుగుపెట్టనుండగా...ఇంతలోనే ఊహించని ఘటన. ఏ దేశమైతే తనకు అండగా ఉంటుందని భావించిందో...ఆదేశమే తనని పట్టించింది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది..?
అందులో ఉంది ఎవరో కాదు. దుబాయ్ రాజు గారాలపట్టీ...యువరాణి లతీఫా. ఇంటి నుంచి పారిపోయి అప్పటికి పది రోజులు గడిచిపోయింది. అంతర్జాతీయ సముద్రజలాలను దాటబోతున్నారు. ఇక తమని ఎవరూ ఏమీ చేయరన్న ధీమాతో ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో భారత భూభాగంలోకి అడుగుపెట్టబోతున్నామన్న సంతోషంలో ఉన్నారు వారంతా. కెప్టెన్, తన కోచ్తో కలిసి మాట్లాడింది ప్రిన్సెస్. భారత్ వెళ్లాక...ఎవరెవర్ని సంప్రదించాలి, ఎక్కడుండాలి..? అమెరికా ఎలా చేరుకోవాలో..సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు. అప్పటికే బోటు భారత తీరానికి అతి దగ్గరగా వచ్చింది. మరో 10 నిమిషాల్లో గోవా చేరుకుంటామని కేప్టెన్ తెలిపారు. ఆ యువరాణి కొత్త ప్రపంచం గురించి ఎన్నో కలలు కన్నారు.
ఇంతలోనే ఊహించిన ఘటన. అంతే..ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఏ ప్రభుత్వ సాయాన్ని కోరాలని భావించిందో... అదే ప్రభుత్వ దళాలు ఆమె ప్రయాణిస్తున్న యాచ్ను చుట్టుముట్టాయి. రెండు బోట్లు, హెలికాప్టర్లు వెంబడించాయి. స్మోక్ బాంబులు విసురుతూ...ఆ బోటును చుట్టుముట్టాయి. యాచ్లోకి ప్రవేశించడం, యువరాణి లతీఫాను నిర్భందించడం క్షణాల్లోనే జరిగిపోయింది. షాక్ నుంచి తేరుకున్న లతీఫాకు విషయం అర్థమైంది. తనని వెనక్కి తీసుకెళ్లొద్దని బతిమాలింది. దుబాయ్ తీసుకెళ్లడం కంటే ఇక్కడే కాల్చిపాడెయ్యండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తాను ఆశ్రయం కోరుతూ భారత్ వచ్చానని దయచేసి వెనక్కి పంపొద్దని వేడుకుంది. కానీ ఎవరూ కనికరించలేదు. ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన విషయం కావడంతో... నేవీ అధికారులు వెనక్కి తగ్గలేదు. ఆమెను ఎమిరెట్స్కు అప్పగించారు.
స్వేచ్ఛను వెతుక్కుంటూ 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ నుంచి బయల్దేరింది రాజు మహ్మద్ బిన్ రషీద్ కుమార్తె లతీఫా. తనకు యుద్ధరంగంలో శిక్షణ ఇచ్చిన టీనా, ఫ్రెంచ్ గూఢచారి జౌబెర్ట్తో కలిసి ఎస్కేప్ ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం ఒక కేఫ్ వద్దకు చేరుకున్న లతీఫా.. వాష్రూమ్లో డ్రెస్సులు మార్చుకుంది. ఎవరూ గుర్తుపట్టకుండా గెటప్ మార్చేసింది. తన ఫోన్ను స్విఛాఫ్ చేసి అక్కడే డస్ట్బిన్లో పడేసింది. ఓ కారులో మస్కట్ చేరుకున్నారు. యాచ్ ద్వారా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించారు. యూఎస్ జెండా ఉన్న ఆ యాచ్లో భారత్వైపు బయల్దేరారు. కానీ ఊహించని రీతిలో మళ్లీ దుబాయ్కు చేరుకుంది. ఇస్లాం కట్టుబాట్ల నుంచి విముక్తి ప్రయత్నించి... చెరసాలలో చిక్కుకుంది లతీఫా. లతీఫా అరెస్టు అయ్యి రెండేళ్లు గడుస్తున్నా...ఆమెకు సంబంధించిన చిన్న క్లూ కూడా బయటకు రావట్లేదు. ఆమెను ఎక్కడ నిర్భందించారో తెలియదు. తను క్షేమంగానే ఉన్నారా..? లేదా అన్నది క్లారిటీ లేదు.