ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఆయనకు లేఖ రాశారు బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్. అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీని ఇంకా నెరవేర్చలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అనేక విజ్ణప్తులు వస్తున్న సందర్భంగా రామచంద్రయాదవ్... చంద్రబాబుకు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సమయంలో మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, ఇంకా ఆ హామీని నెరవేర్చలేదని రామచంద్రయాదవ్ లేఖలో పేర్కొన్నారు. మదనపల్లె జిల్లా ఏర్పాటు చేసి ఆ జిల్లాకు రవీంద్రనాధ్ ఠాగూర్ లేదా అబ్దుల్ కలాం పేర్లను పెట్టాలని కోరారు. భారత జాతీయ గీతమైన జనగణమన తెలుగులో పురుడుపోసుకున్న ప్రాంతం మదనపల్లె కావడంతో... ఆ జిల్లాకు రవీంద్రనాధ్ ఠాగూర్ పెట్టాలని కోరారు. ఒకవేళ కుదరకపోతే బహుముఖ ప్రజ్ణాశాలి అయిన అబ్దుల్ కలాం పేరును పెట్టాలని సూచించారు. మదనపల్లెతో పాటు కడప జిల్లాలోని బద్వేలు జిల్లా ఏర్పాటుకు కూడా ప్రజల నుంచి డిమాండ్ గట్టిగా వస్తోందన్నారు.


అక్కడి ప్రజల మనోభావాలను ద్రుష్టిలో పెట్టుకొని బద్వేలు జిల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఆ జిల్లాకు పోతులూరి వీర్రబ్రహ్మేంద్ర స్వామి పేరును పెట్టాలని సూచించారు. బలహీన వర్గాల జాతిలో పుట్టి కాలజ్ణానాన్ని అందించిన ఆయన పేరు పెట్టడం సముచితంగా ఉంటుందన్నారు. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాలైన గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి, దర్శి నియోజకవర్గాలతో పొదిలి కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలనే వాదన ఆ ప్రాంతంలో బలంగా వినిపిస్తోందన్నారు. పరిపాలనా సౌలభ్యంతో పాటు సేవలు మెరుగుపడాలనే ఉద్దేశ్యంతో అక్కడి ప్రజలు చాలా బలంగా నూతన జిల్లా ఏర్పాటును కోరుకుంటున్నారని తెలిపారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కాటమరాజ చరిత్రకు ఆధారంగా విలసిల్లిన ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి... మనిషిగా జన్మించి పూజలు అందుకునే దేవుడిగా మారిన కాటమరాజు పేరుతో పొదిలి జిల్లాను ఏర్పాటు చేయాలని రామచంద్రయాదవ్ ఆ లేఖలో చంద్రబాబును విజ్ణప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: