తెలంగాణ కాంగ్రెస్లో ఇటీవల కాలంలో కొత్త రక్తం ఎక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఆయనతో పాటు ఆయన పరివారం అంతా కాంగ్రెస్లో చేరిపోతుందని ఆశలు పెట్టుకున్నా అంత సీన్ కనిపించలేదు. అయినా కూడా కాంగ్రెస్ నేతలు డీలా పడలేదన్న విషయం తాజాగా వెలుగు చూసింది. 2019లో అధికార టీఆర్ ఎస్ను గద్దె దింపి, సీఎం కేసీఆర్కు పరాభవం కలిగించాలని స్థానిక నేతలు మంచి పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవకాశం దొరికిన ప్రతిసారీ.. నేతలు తమ తమ స్టైళ్లలో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కనుసన్నల్లో యువతను పార్టీలోకి చేర్చుకునేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు కూడా చేస్తున్నారు.
ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండడంతో నేతలు ఇప్పటి నుంచే తమ సన్నాహాలు, ప్రణాలికలను అమలు చేస్తున్నారు. శనివారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీకి చెందిన హేమా హేమీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో విజయం సాదించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై తొలుత నేతలు అంతర్గతంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మోస్ట్ నేత, కేంద్ర మాజీ నేత జయపాల్ రెడ్డి సహా సీనియర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ను తప్పకుండా అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేయాలన్న ఆయన ఇప్పటి వరకు బలమైన నినాదం ఏదీ కాంగ్రెస్కు లేకపోవడం కూడా లోపంగా ఆయన పేర్కొనడం సంచలనం సృష్టించింది.
దీనిని సీనియర్ నేతలు సీరియస్గా తీసుకున్నారు. ఇక, జైపాల్ మాట్లాడుతూ.. కేసీఆర్కో హఠావ్... తెలంగాణాకో బచావ్ నినాదంతో మనం ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో నేతలు హుషారెత్తిపోయారు. జైపాల్ ఇంకా మాట్లాడుతూ.. మూడుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా త్యాగం చేశారని అన్నారు. సోనియా రాజకీయ లెక్కలు బేరీజు వేయకుండా తెలంగాణ ఇచ్చారని చెప్పారు. కేసీఆర్కో హఠావ్... తెలంగాణాకో బచావ్ అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్లో రేవంత్ బృందం చేరిక రాజకీయశక్తుల పునరేకీకరణలో భాగమేనన్నారు. సోనియాతో జట్టు కడతానని మాటిచ్చిన కేసీఆర్ ఆతర్వాత ఆమెకే హ్యాండిచ్చారని, ఈ విషయంలో సోనియా హర్ట్ అయ్యారని అప్పటి విషయాలను కూడా వెల్లడించారు. ఈ క్రమంలో సొనియాకు బర్త్డే గిఫ్ట్గా కేసీఆర్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఏదేమైనా జైపాల్ ఇచ్చిన నినాదం.. కేసీఆర్కో హఠావ్... తెలంగాణాకో బచావ్ ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలని డిసైడ్ కావడం గమనార్హం. మరి దీంతో కాంగ్రెస్ హవా పెరుగుతుందో లేదో చూడాలి.