కొత్త రాజకీయ పార్టీ పెట్టే విషయమై సిబిఐ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. తనకు రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశ్యం లేదని స్పష్టంగా ప్రకటించారు. కాకపోతే రైతుల సంక్షేమం కోరే రాజకీయ పార్టీతోనే తన ప్రయాణం ఉంటుందంటూ మళ్ళీ కొంచెం సస్పెన్స్ మెయిన్ టెన్ చేస్తున్నారు. ఏ పార్టీ అయినా అందునా సాధారణ ఎన్నికలకు ముందు రైతుల సంక్షేమం తమకు పట్టదని ప్రకటన చేస్తుందా ? ఇక్కడే జెడి తెలివైన ప్రకటన చేశారు.
స్పష్టత ఇవ్వకుండానే నాన్చారు
వచ్చే ఎన్నికల్లోగా జెడి రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దానికితోడు ఆయన కూడా ఏ విషయంపైనా స్పష్టత ఇవ్వకుండా ఇంతకాలం నాన్చుతూ వచ్చారు. అదే సమయంలో రైతుల్లో చైతన్యం పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. దాంతో కొత్త రాజకీయ పార్టీపై ప్రచారం పెరిగిపోయింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో జెడి టచ్ లో ఉన్నారన్న ప్రచారాన్ని కూడా జెడి ఏరోజూ ఖండిచలేదు. దాంతో ఊహాగానాలకు అంతు లేకుండా పోయింది.
ఏ పార్టీలో చేరుతారు ?
మొత్తానికి వాస్తవం గ్రహించినట్లున్నారు జెడి. ఒకవైపు అధికార టిడిపి. ఇంకోవైపు ప్రధాన ప్రతిపక్ష వైసిపి. వీటికి అదనంగా జనసేన, బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు వేటికవే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇన్ని పార్టీల మధ్య తాను కొత్త పార్టీ పెట్టినా ఉపయోగం ఉండదని జెడికి అర్ధమైందేమో ? మొత్తానికి కొత్త పార్టీ పెట్టే విషయంపై మాత్రం క్లారిటీ ఇచ్చేసి ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరే విషయం మీద మాత్రం సస్పెన్స్ మిగిల్చారు.