వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్కాంలో నిందితుడు, డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీ మరో భారీ స్కామ్కు పాల్పడ్డాడు. .వేల కోట్లకు ముంచి, ప్రస్తుతం ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న నగల వ్యాపారి మెహుల్ చోక్సీ చేసిన మరో మోసం బట్టబయలైంది. ఇతడు తమను రూ.44.1 కోట్లకు మోసం చేశాడని మరో ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (పీఎస్బీ) వెల్లడించింది. దీంతో కలుపుకుంటే చోక్సీ మూడు ప్రభుత్వ బ్యాంకులకు టోపిపెట్టాడు. ఇతడిని ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ప్రకటించింది. బాకీ వసూలుకు చట్టపరమైన చర్యలు మొదలుపెట్టినట్టు ప్రకటించింది.
పీఎన్బీలో స్కాం చేసిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సిలు.. 2018 ఫిబ్రవరిలో దేశం విడిచిపారిపోయారు. ఈ స్కాం వెలుగులోకి వచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఓబీసీ వీరి అకౌంట్లను ఎన్పీఏలుగా డిక్లేర్ చేసింది.తఇతడు తమకు రూ.405 కోట్లు ఎగ్గొట్టి పారిపోయాడని గత ఏడాది స్టేట్ బ్యాంక్ తెలిపింది. తాము కూడా చోక్సీకి రూ.289 కోట్లు ఇచ్చామని గత సెప్టెంబరులో ఓబీసీ వెల్లడించింది. చోక్సికి చెందిన కంపెనీలు
గీతాంజలి జెమ్స్ రూ.136.45 కోట్లు, నక్షత్ర వరల్డ్ లిమిటెడ్ రూ.59.53 కోట్లు ఎగ్గొట్టాయని తెలిపింది. తదనంతరం ఓబీసీ పీఎన్బీలో విలీనమయింది. కాగా, చోక్సీ అధీనంలోని
గీతాంజలి జెమ్స్,
గీతాంజలి ఎక్స్పోర్ట్స్కు అప్పులు ఇచ్చామని పీఎస్బీ తెలిపింది. అతడు వీటికి డైరెక్టర్గా, గ్యారంటార్గా ఉండేవాడు. ఈ రూ.44 కోట్లను పీఎస్బీ గత ఏడాది మార్చిలోనే మొండిబాకీగా పుస్తకాల్లో రాసుకుంది.
కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలను ఎందుకు రికవరీ చేయవు, బకాయిలను తిరిగి పొందేందుకు చట్టపరమైన చర్యలు ఎందుకు చేపట్టరని ట్రేడ్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (తుజాక్) మహారాష్ట్ర కన్వీనర్ విశ్వస్ ఉతాగి ప్రశ్నించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రభావిత బ్యాంకుల్లో విదేశీ మారకద్రవ్య విబాగాల్లో పనిచేస్తున్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. నిందితులు (చోక్సీ, నీరవ్ మోడీ) నుండి ఎంత మేరకు బకాయిలు వసూలు చేశారు. రాబోయే బ్యాంకుల విలీనానికి ముందు ఇప్పుడు వెలువడుతున్న వివరాలతో ఒత్తిడిని కలిగించనున్నాయా అని ఉతాగి బ్యాంకింగ్ రంగాన్ని ప్రశ్నిస్తున్నారు. భారతీయ బ్యాంకుల్లోని అన్ని ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని, వారి వివరాలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం చోక్సీ వెస్టిండీస్లోని ఆంటిగ్వా- బార్బడోస్ పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడిన సంగతి తెలిసిందే. 111 ఏళ్ల చరిత్ర కల్గిన పీఎస్బీ తాము మోసపోయామని వెల్లడించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.