ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ అభిమానులకు నిండైన వినోదాన్ని అందిస్తూ ముగిసింది. ఎప్పటిలానే ఈసారి కూడా స్టార్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనలు చేయగా, కొత్తగా వెలుగులోకి వచ్చిన యువ ఆటగాళ్లు క్రికెట్ ప్రపంచానికి తమని తాము పరిచయం చేసుకున్నారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్రతిభావంతులైన ప్లేయర్లకు వివిధ అవార్డులు లభించాయి. ఈ ఏడాది ఎవరికీ ఏ అవార్డు దక్కిందో ఇప్పుడు చూద్దాం.

ఈ సీజన్‌లో మోస్ట్ వ్యాల్యూబుల్ ప్లేయర్ (MVP) అవార్డును ముంబై ఇండియన్స్ స్టార్ సూర్య కుమార్ యాదవ్ దక్కించుకున్నాడు. అన్ని విభాగాల్లో సమతుల్యంగా ప్రభావం చూపినందుకు ఆయనకు ఈ గౌరవం లభించింది.

ఆరెంజ్ క్యాప్ విజేతగా గుజరాత్ టైటాన్స్ యువ ఆటగాడు సాయి సుదర్శన్ నిలిచాడు. ఈ సీజన్‌లో అతడు 759 పరుగులు సాధించి తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని చాటాడు. అదే సమయంలో అతనే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును కూడా అందుకున్నాడు. యువ క్రికెటర్లలో అతడి ప్రదర్శన ఎంతో ప్రశంసనీయమైనదిగా నిలిచింది.

బౌలింగ్ విభాగంలో అత్యుత్తమంగా నిలిచిన ఆటగాడు ప్రసిద్ధ్ కృష్ణ. అతడు 25 వికెట్లు తీయడంతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. కన్సిస్టెంట్ లైన్లు, వెరియేషన్ తో బ్యాట్స్‌మెన్‌ ను ఇబ్బంది పెట్టిన ప్రసిద్ధ్ ఈ సీజన్‌లో తన బెస్ట్ ఫాం కనబరిచాడు.

క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు కమిందు మెండిస్‌కు లభించింది. అతని స్పైడర్‌ మ్యాన్ స్టైల్ క్యాచ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఇది మ్యాచ్‌ టర్నింగ్ పాయింట్‌ గా మారిన క్యాచ్‌ గా గుర్తింపు పొందింది.

ఫెయిర్ ప్లే అవార్డ్ ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఖాతాలో చేరింది. క్రీడాస్పూర్తిని కాపాడుతూ ఆడిన జట్టుగా చెన్నై మరోసారి ఈ గౌరవాన్ని సొంతం చేసుకుంది.

సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ గా సూర్య వంశీ నిలిచాడు. తక్కువ బంతుల్లోనే అత్యధిక పరుగులు సాధించి స్ట్రైక్ రేట్‌ను ఆకాశానికెత్తిన ఆయన ఆడిన ఇన్నింగ్స్‌ లు ఆకట్టుకున్నాయి.

అంతేకాదు, సాయిసుదర్శన్ సీజన్‌లో అత్యధిక 4లు బాదిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. టెక్నికల్‌గా అద్భుతంగా ఆడిన అతడు క్లాస్సి షాట్లు‌తో అభిమానులను మెప్పించాడు.

ఈ విధంగా ఐపీఎల్ 2025 సీజన్ అనేక ఆటగాళ్ల ప్రతిభను వెలికితీసి, భవిష్యత్ భారత క్రికెట్‌కు నూతన తారల్ని పరిచయం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: