బెజవాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ నాయకుడిగా గుర్తింపు సాధించిన వంగవీటి రాధా ఆ పార్టీకి రాజీనా మా చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం ఏర్పడింది. అంతేకాదు.. రాజీనామా సందర్భంగా రాధా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనానికి దారితీశాయి. తాను చూరు పట్టుకుని వేలాడనని, టికెట్ కోసం మనస్సాక్షిని చంపుకుని, నా ఆత్మ ను తాకట్టు పెట్టుకోలేనంటూ రాధా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ వాస్తవానికి నాలుగు మాసాలుగా జరుగుతూనే ఉంది. అయితే, రాధాకు బెజవాడ సెంట్రల్ టికెట్ తప్ప ఏదైనా ఇస్తామని వైసీపీ చెబుతుండ డం, లేదు.. తనకు మాత్రం సెంట్రలే కావాలనడంతో ఇది తెగేదాకా వచ్చింది.
గత ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీ చేసి ఓడిన రాధా ఆ తర్వాత సెంట్రల్కు ఇన్చార్జ్గా మారారు. వచ్చే ఎన్నికల్లో ఆయన సెంట్రల్ నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే సడెన్గా మల్లాది విష్ణుకు ఆ బాధ్యతలు ఇవ్వడంతో రాధా కొద్ది రోజులుగా అలుగుతూనే వస్తున్నారు. ఇక, ఈ పరిణామాలను విశ్లేషిస్తే.. రాధా తీసుకున్న నిర్ణయం ఆయనకు ప్లస్గా మారుతుందని అంటున్నారు పరిశీలకులు. గతంలో ఆయన తండ్రి, వంగవీటి రాధా కూడా కాంగ్రెస్ టికెట్ ఇవ్వనని చెప్పిన సమయంలో పార్టీ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా బరిలో నిలిచి పోరాడిన పంథా మరోసారి తెరమీదికి తెస్తున్నారు.
దీంతో ఒక్కసారిగా రాధా రేటింగ్ పెరిగిపోయింది. వాస్తవానికి వైసీపీలో ఉన్నా.. సెంట్రల్ టికెట్ ప్రకటించినా కూడా ఈ రేంజ్లో రేటింగ్ పెరిగేది కాదని అంటున్నారు. ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా.. వెళ్లకున్నా .. ఒంటరిగా ఇండిపెండెంట్గా సెంట్రల్ నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశం ఏర్పడిందనే విశ్లేషణలు అందుకున్నాయి. అదే సమయంలో ఇక్కడ వైసీపీ ఎంతో ముద్దుగా టికెట్ ఇచ్చిన మల్లాది విష్ణుకు వ్యతిరేక పవనాలు తీవ్రంగా వీస్తున్నాయి.
గతంలో కాంగ్రెస్ టికెట్పై ఇక్కడి నుంచే విజయం సాధించిన ఆయన చేసింది ఏమీలేదని ఇక్కడి ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. ప్రతి పనిలోనూ కమీషన్లు దండుకున్న వ్యవహారాన్ని సైతం చెప్పుకొంటున్నారు. పైగా ఆయనకు మాస్తో అంత టచ్ లేదు. గతంలో అంటే వైఎస్ హవా నేపథ్యంలో గెలిచినా.. ఒంటరిగా ఆయన తన ఫిగర్తో ఓట్లు సాధించే పరిస్థితి లేదనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి. పైగా ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం పరిణామాలను విశ్లేషిస్తే. రాధా ఎఫెక్ట్ బాగానే ఉంటుందని, వైసీపీ కోలుకోవడం కష్టమనే అంటున్నాయి రాజకీయ వర్గాలు.