వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టాక నిర్వహించనున్న తొలి కలెక్టర్ల సదస్సులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. షెడ్యూల్ విషయంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు వెలువరించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 24న ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సింది. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం చేస్తారు. పరిపాలనలో పారదర్శకత, గ్రామ సచివాలయాలు, గ్రామ సేవకుల వ్యవస్థ, ఆరోగ్యశ్రీ, 104, 108 సేవలు, పౌరసరఫరాలు, పాఠశాల విద్య, కరవు, వ్యవసాయం పరిస్థితి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరాపై సమీక్ష ఉంటుంది. మధ్యాహ్నం సామాజిక పింఛన్లు, గృహ నిర్మాణం, కౌలు రైతులకు ఎల్ఈసీ కార్డుల జారీ, శాంతిభద్రతలపై సమీక్ష ఉంటుంది.
అయితే, సోమ, మంగళవారాలు రెండు రోజులపాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. మద్యాహ్నం మూడు గంటలతో కలెక్టర్ల సదస్సు ముగియనుంది. మంగళవారం శాంతిభద్రతలపై కలెక్టర్లు,ఎస్పీలు,ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు పోలీస్ అధికారులు, ఎస్పీలతో సీఎం ప్రత్యేక సమావేశం కానున్నారు. మంగళవారం మధ్యాహ్నంతో సదస్సు ముగియనుంది.