అదేంటో కానీ ఎక్కడైనా సంత్రుప్తి ఉంటుంది కానీ రాజకీయాల్లో మాత్రం ఉండదు. చంద్రబాబు 1999లో గెలిచిన తరువాతనే విజన్ 2020 అన్నారు. అంటే ఇరవయ్యేళ్ళు ఏకధాటిగా గెలవాలని ఆయన ఆరాటమది. 2009లో గెలిచిన తరువాత వైఎస్సార్ 2014 ఎన్నికలే టార్గెట్ అన్నారు. తాజాగా ఎన్నికల్లో గెలిచాక జగన్ 2024 మన లక్ష్య‌మని క్యాడర్ కి చెప్పారు. ఇక కేంద్రంలో బీజేపీ టార్గెట్ 2047 దాకానట.


ఈ మాటలు అన్నది ఏపీకి చెందిన సీనియర్ బీజేపీ నేత వారణాశి రాం మాధవ్.  నిజానికి ఎన్నికలు అన్నవి ప్రజాస్వామ్యంలో ఓ ప్రక్రియ. వాటి ద్వారా అధికారాన్ని సంపాదించిన పాలకులు ప్రజలకు మేలు చేయడం ముఖ్యమైన బాధ్యత. అయితే ఇపుడున్న పరిస్థితులు చూస్తే ఒక ఎన్నికతో దాహం తీరడం లేదు. గెలిచిన వారు నెక్స్ట్ టార్గెట్లు పెట్టుకుంటే, ఓడిన వారు ఎటూ మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. 


కేంద్రంలో నరేంద్ర మోడీ రెండవమారు బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అయిదేళ్ళకు సరిపడా హామీలు ఇచ్చిన మోడీ వాటిని నెరవేరుస్తారని కోటి ఆశలతో వందన్నర  కోట్ల భారతం ఎదురుచూస్తోంది. అయితే మోడీ, అమిత్ షా ఎత్తులు జిత్తులు వేరేగా  ఉన్నాయి. దాంతో అనేక ప్రతిపక్ష  రాష్ట్రాల్లో రాజకీయ అశాంతి చెలరేగుతోంది. అందరూ వూహిస్తున్నట్లుగానే కర్నాటకలో  బీజేపీ అధికారాన్ని పట్టేసింది. . అక్కడ కుమార స్వామి సర్కార్ ని ఇంటికి పంపించి యడ్యూరప్పను  గద్దె మీద కూర్చోబెట్టింది. 


కేంద్ర ప్రభుత్వం దన్నుగా ఉంది. దాంతో విపక్షంలో ఉన్న ప్రభుత్వం నడ్డి విరిచి తాము ఏలికలు కావాలన్న కసితో అశ్వమేధ యాగాన్ని బీజేపీ మొదలెట్టింది. కర్ణాటకలో దారుణమైన  రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూంటే మూడు నెలల క్రితవం వరకూ రెచ్చిపోయిన ప్రతిపక్షాల గొంతు మాత్రం ఇపుడు ఎక్కడా  పెగలడంలేదు.  ఎందుకంటే వారంతా పరాజయ గాయలపాలైన వారే. ఇక మధ్యప్రదేశ్  లో కూడా కర్నాటక ఫార్ములాతో బీజేపీ పావులు వేగంగా కదుపుతోంది.


అక్కడ కేవలం అయిదు మంది మాత్రమే బీజేపీ కంటే కాంగ్రెస్ పక్షాన ఎక్కువగా గెలిచారు. కర్నాటకం తరువాత మధ్యప్రదేశ్  కధ మొదలవుతుందన్న మాట. దాని తరువాత రాజస్థాన్ అంటున్నారు.  మరో వైపు తెలంగాణాలో కూడా అవకాశాలు ఏమైనా ఉంటే వెతలాలని బీజేపీ డిసైడ్ అయిందని వార్తలు వస్తున్నాయి.


ఇక ఏపీలో జగన్ సర్కార్ ఏడాది పాలన వరకూ చూసి అపుడు ఇక్కడ కూడా ఆపరేషన్ స్టార్ట్ చేయాలన్నది బీజేపీ నయా వ్యూహంగా ఉంది. ఇవన్నీ చూస్తూంటే రాజకీయమే తప్ప పాలన నేను చేయను, మిమ్మల్ని చేయనివ్వను అంటూ ప్రతిపక్షాలతో  కాషాయం పార్టీ గట్టి శపధమే చేసినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ రాజకీయం విపక్షాలకు కంఠంలో కషాయాన్ని నింపుతున్నాయి. ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: