కల్తీ లిక్కర్ డాన్ విశాఖలో లిక్కర్ మాఫియా ఎవరని అడిగితే అందరూ ఠక్కున చెప్పే పేరు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ దన్నుతో ఏడు నెలల కిందటి వరకు వెలగపూడి ‘లిక్కర్’ అక్రమాల జోలికి వెళ్ళేందుకు సాహసించలేని ఎక్సైజ్ పోలీసులకు ఇప్పుడు పగ్గాలొచ్చాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా వెలగపూడి సిండికేట్లో మార్పు వస్తుందని అధికారులు ఆశించారు. అయితే గతంలో మాదిరిగానే సదరు మాఫియా అడ్డగోలుగా వ్యవహరిస్తుండటంతో మెరుపు దాడులు చేశారు. రెడ్ హ్యాండెడ్గా మద్యం కల్తీ చేస్తుంటే పట్టుకున్నారు.
ఇక అస్సలు వివరాల్లోకి వెళితే.. అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం నగరంలోని ద్వారకా బస్టాండ్ ఎదుట ఉన్న దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ ఎవరిదనేది. సతీష్ అనే టీడీపీ కార్యకర్త జీవీఎస్ఎన్ సత్యనారాయణ పేరిట ఉన్న ఈ బార్ను నిర్వహిస్తుంటాడు. వెలగపూడి బినావీులు వీరిద్దరూ నిజానికి లిక్కర్ సిండికేట్కే కాదు.. ఎక్సైజ్ అధికార వర్గాలందరికీ తెలిసిన వాస్తవం.
ఈ బార్ అండ్ రెస్టారెంట్పై కల్తీ, నాసిరకం మద్యం విక్రయిస్తున్నారంటూ ఎప్పటి నుంచో వివిధరకాల ఆరోపణలున్నాయి. అయితే గత ఐదేళ్ళుగా అధికారం దన్నుతో ఎవ్వరూ వీటిపైనా దాడులు చేసే సాహసం చేయలేదు. గురువారం పక్కాగా సమాచారం రావడంతో ఎక్సైజ్ విశాఖపట్నం ఎక్సైజ్ ఈఎస్, టాస్క్ఫోర్స్ సీఐ సూర్యకుమారి సూపరింటెండెంట్ సీహెచ్ దాస్ ఆదేశాల మేరకు సిబ్బంది దాడులు చేపట్టారు. క్రేజీ డాల్ ఓసీ బ్రాండ్ మద్యంలో ఒక చీప్ లిక్కర్ను,రెడ్ హ్యాండెడ్గా ఎంసీ బ్రాందీలో ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీని కలిపి కల్తీ చేస్తుండగా పట్టుకున్నారు.
17 ఫుల్ బాటిళ్ళను అప్పటికే కల్తీ చేసారు వాటిని కూడా సీజ్ చేశారు. అదుపులోకి సిబ్బందిని తీసుకుని ఎక్సైజ్ పోలీస్స్టేషన్కు తరలించారు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే వెలగపూడి.. విషయం బయటకు పొక్కకుండా కేసును నిర్వీర్యం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు కల్తీ మద్యం కేసు మూలాల్లోకి వెళ్తారా.. లేదా కేవలం సిబ్బందికే పరిమితం చేస్తారా అనేది చూడాలి.