అనంతపురం జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకులు, అనంతపురం రాజకీయాలను కనుసైగలతో శాసించిన జేసీ బ్రదర్స్ కు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జేసీ బ్రదర్స్ కు అడ్డుకట్ట పడింది. వివాదాలకు ఎప్పుడూ కేంద్రబిందువుగా ఉండడంతో పాటు, అందరిపైనా విమర్శలు చేస్తూ, ఎప్పుడూ జేసీ బ్రదర్స్ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి వార్తల్లో ఉంటూనే వస్తున్నారు. వారు ఏ పార్టీలో ఉన్నా, తమదైన శైలిలో ముందుకు వెళుతూ ఉంటారు. సొంత పార్టీ నేతలను, పార్టీ అధినేతలను సైతం విమర్శించేందుకు ఎక్కడా వెనకాడరు. ఇక జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ బ్రదర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.


ఆ కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరు అయిన ట్రావెల్స్ వ్యాపారం చాలా వరకు వైసీపీ ప్రభుత్వం కారణంగా చాలా వరకూ దెబ్బతింది అనే అభిప్రాయంలో జేసీ బ్రదర్స్ ఉన్నారు. దీంతో పాటు అక్రమంగా వాహనాలను అమ్మిన కేసులో ఇటీవలే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ వ్యవహారంలో ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపారు. ఆ తరువాత బెయిల్ పైన బయటకు వచ్చిన సందర్భంగా జరిగిన ర్యాలీలో పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగం పై మరోసారి అరెస్ట్ అయ్యారు.


 ఆ తర్వాత కరోనా ప్రభావం గురవడంతో ఆసుపత్రిలో చికిత్స పొంది తాజాగా తాడిపత్రి కి వచ్చారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చిన సందర్భంగా ఆయన అభిమానులు భారీగా తరలి రావడం, ఆయనకు ఘన స్వాగతం పలకడం వంటివి జరిగాయి. అయితే కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్న  సమయంలో ఈ విధంగా చేయడంతో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలతో మళ్లీ తాడిపత్రి పోలీసులు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డి మరో 32 మంది కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. దీంతో మరోసారి జేసీ ప్రభాకరరెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: