అయితే.. వీడియో కాన్ఫరెన్స్ అయితే.. జరిగింది.. ఎన్నికల కమిషనర్ కూడా సమయానికి పలు ప్రణాళికలతో రెడీ అయ్యారు. అయితే.. ఎటొచ్చీ.. ఒక్క అధికారి కూడా కాన్ఫరెన్స్ హాజరు కాలేదు. ప్రబుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి డీజీపీ వరకు కలెక్టర్ నుంచి ఇతర అధికారుల వరకు ఎవరూ కూడా ఈ కాన్ఫరెన్స్కు రాలేదు. దీంతో ఇప్పుడు అది పెద్ద సమస్య ఎన్నికల కమిషన్ ముందు స్పష్టంగా కనిపిస్తోంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 243 కె-ద్వారా సంక్రమించిన ప్రత్యేక అధికారాలతో తాను ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నానని కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
అయితే.. ఇటు ప్రభుత్వం కానీ, అటు అధికారులు, ఉద్యోగులు కానీ.. ఏ ఒక్కరూ దీనికి సహకరించకపోవడం గమనార్హం. మరి తద్వారా ఎదురయ్యే పరిణామాలు వారికి తెలియవని అనుకోవాలా? లేక.. ఏం జరిగినప్పటికీ.. ప్రభుత్వం తమకు అండగా ఉం టుందని భావిస్తున్నారా? ఇవన్నీ కాకుండా.. ఎన్నికల కమిషనర్ వెల్లడించిన నోటిఫికేషన్లో ఎక్కడైనా లూప్ హోల్ ఉందా ? ఇది భవిష్యత్తులో తమను కాపాడుతుందని ఉద్యోగులు, అధికారులు భావిస్తున్నారా? అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. నిజానికి ఇలాంటి అసాధారణ పరిస్థితి ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా జరగలేదని నిపుణులు సైతం చెబుతున్నారు.
మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఏపీ రాజకీయాలు కానీ, ప్రభుత్వ పరిస్థితి కానీ.. ఎటు దారితీస్తాయి? అనేది ఉత్కంఠగా మారింది. నిజానికి రాజ్యాంగ బద్ధమైన సంస్థ కనుక ఎన్నికల కమిషన్దే పైచేయి అని ఇప్పటి వరకు అంతా భావిస్తున్నారు. మరి ఇప్పుడు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇంతకు మించి ఏదైనా ఉందా? ఈ కారణంగానే ప్రభుత్వం, అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో!!