జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది. అప్పుడు ఇదే ప్రత్యేక హోదా కోసం ఆయన తన ఎంపీలతో రాజీనామా చేయించారు. రాజీనామా చేస్తే కేంద్రం దానంతట అదే దిగి వస్తుందని చెప్పారు. ఆ రాజీనామాలు కూడా ఎన్నికలకు కొద్ది నెలల ముందే కావడంతో కేంద్రం, బీజేపీ చాలా లైట్ తీస్కొన్నాయి. ఇప్పుడు మళ్లీ జగన్ తనకు ఓట్లేసి బంపర్ మెజార్టీ కట్టబెట్టిన ప్రజలను బకరాలను చేస్తున్నారు. మరి ఇప్పుడు కూడా బీజేపీ ఫుల్ మెజార్టీ ఉందని చెపుతున్నారు. అయితే ఇప్పుడు జగన్ ఎందుకు రాజీనామాలు చేయించడం లేదు ? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
అసలు 2019 ఎన్నికలకు ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావని డిసైడ్ అయ్యే జగన్ తన ఎంపీలతో రాజీనామా డ్రామాలు ఆడారన్న విమర్శ మూటకట్టుకున్నారు. ఇప్పుడు ఇంత మెజార్టీ ఉన్నా హోదా కోసం బీజేపీపై చిన్న ఒత్తిడి కూడా తేవడం లేదన్న విమర్శలు మరోసారి మూటకట్టుకోక తప్పడం లేదు. లోక్సభలో బీజేపీకి ఫుల్ మెజార్టీ ఉంది.. మన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి చెపుతున్నా... రాజ్యసభలో వైసీపీ మద్దతిస్తే తప్ప కీలక బిల్లులు పాస్ కావు. ఇవన్నీ తెలిసి కూడా జగన్ బీజేపీ అడగకుండానే పొలోమని ఆ పార్టీ బిల్లులకు మద్దతు ఇస్తున్నారు. కానీ హోదా అన్న చిన్న మాట అడగడం లేదు. ఇవన్నీ చూస్తుంటే జగన్ బీజేపీకి భయపడుతోన్న వాతావరణమే కనిపిస్తోన్నట్టు ఉందన్నది సామాన్య జనాలకు కూడా అర్థమవుతోంది.