ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీని మట్టికరిపించాలి. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు ముందున్న లక్ష్యం ఇదే. ఇంకా ఎన్నికలకు రెండున్నరేళ్ల వరకూ ఉన్నా.. ఇప్పటి నుంచే చంద్రబాబు ఎన్నికల హామీలు ఇవ్వడం ప్రారంభించారనే చెప్పొచ్చు. కొన్నాళ్ల క్రితం జగన్ సర్కారు ఇళ్ల పట్టాలు ఇవ్వడం ప్రారంభించింది. దీని కోసం వన్ టైమ్ సెటిల్‌మెంట్ పేరిట నిర్ణీత మొత్తంలో కొంత మొత్తం వసూలు చేస్తోంది. ఈ అంశంపై కొన్నిరోజులుగా విపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి.


ఇప్పుడు తెలుగు దేశం ఓ అడుగు ముందుకేసింది. వన్ టైం సెటిల్మెంట్ పేరుతో గృహ లబ్ధిదారుల నుంచి నిర్ణీత మొత్తంలో డబ్బులు  వసూలు చేయాలని నిర్ణయించాన్ని టీడీపీ తప్పుబడుతోంది. అంతే కాదు.. వన్ టైమ్ సెటిల్ మెంట్ డబ్బులు కట్టకపోతే సంక్షేమ పధకాలు నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అందుకే..  ఈ డబ్బులు ఎవరూ చెల్లించాల్సిన అవసరం లేదని.. టీడీపీ ప్రభుత్వం రాగానే దాన్ని నిలిపివేసి ఉచితంగా లబ్దిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని టీడీపీ ప్రకటిస్తోంది.


ప్రభుత్వ  పధకాలు ఆపేస్తామని బెదిరిస్తే భయపడొద్దని.. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు  రానివ్వకుండా అడ్డుకునే హక్కు ఎవరికి లేదని టీడీపీ చెబుతోంది. పధకాలు ఆపేస్తే  న్యాయస్ధానంలో పోరాటం చేస్తామంటున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. జగన్ 3 రాజధానుల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప రెండున్నరేళ్ల లో  3 ప్రాంతాల్లో పైసా ఖర్చు చేశారా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ది తప్ప జగన్ చేసిన అభివృద్ది ఏంటి? అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.

 
అంతే కాదు.. గత ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు మెజార్టీ స్ధానాల్లో వైసీపీని గెలిపించారని.. కానీ.. ఇప్పుడు సీమలో వరదలతో ‎ ‎ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం పక్క రాష్ట్రాల్లో పెళ్లి విందులు, వినోదాలతో కాలక్షేపం చేస్తున్నారని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. ‎రెండున్నరేళ్ల వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. అసెంబ్లీలో మహిళలపై వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేల వ్యక్తిగత దుర్బాషల్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: