ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకేరోజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్, చేవెళ్ళ ఎంపి రింజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానం రాజకీయాల్లోకి అడుగుపెట్టింది కాంగ్రెస్ లో. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు గట్టిమద్దతుదారుల్లో దానం కూడా ఒకరు.





అలాంటి దానం వైఎస్ చనిపోవటం, రాష్ట్ర విభజన తర్వాత పరిణామాల్లో బీఆర్ఎస్ లో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పవర్లోకి రావటంతో దానం ప్రతిపక్షంలో ఉండలేకపోయారు. అందుకనే ఆదివారం బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. ప్రస్తుత రాజకీయాలు ఎలాగ తయారయ్యాయంటే ప్రతిపక్షంలో కూర్చోవటానికి చాలామంది ప్రజా ప్రతినిధులు ఇష్టపడంలేదు. ఎందుకంటే వ్యాపారాలు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలతో పాటు ఆస్తులను రక్షించుకునేందుకు మాత్రమే ఎక్కువమంది ప్రాధాన్యతిస్తున్నారు.





తమ ఆర్ధిక, వ్యాపార ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదంటే కచ్చితంగా అధికారపార్టీలోనే ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. కేసీయార్, చంద్రబాబునాయుడు ప్రలోభాలకు, ఒత్తిళ్ళకు గురిచేసి ప్రతిపక్షాల్లోని ఎంఎల్ఏలు, ఎంపీలను తమ పార్టీల్లోకి లాక్కున్నారు. ఇఫుడు ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, ఎంపీలు అదే దారిలో నడుస్తున్నారు.  ఇప్పటికే నలుగురు ఎంపీలు బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్, బీజేపీల్లో చేరారు. అలాగే పదిమంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు రేవంత్ రెడ్డితో  భేటీఅయ్యారు.





ఏదోరోజు బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో అత్యధికులు కాంగ్రెస్ లో చేరిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. అప్పుడు అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ నిట్టనిలువుగా చీలిపోతుందేమో. బీఆర్ఎస్ రెండువర్గాలుగా అసెంబ్లీలొ ఉంటాయా ? లేకపోతే మెజారిటి ఎంఎల్ఏలుండే వర్గమే నిజమైన బీఆర్ఎస్ఎల్పీగా చెలామణవుతుందా ? లేకపోతే మెజారిటి ఎంఎల్ఏల వర్గం కాంగ్రెస్ లో విలీనమైపోతుందా అన్నది చూడాలి. ఇపుడు విషయం ఏమిటంటే దానం ఏదోరోజు కాంగ్రెస్ లో చేరుతారని అనుకుంటున్నదే కాని ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరుతారని చాలామంది ఊహించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: