
ఇకపై జరిగే ఎన్నికల్లో ఎక్కడైనా తమ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆయన ప్రకటించారు. బీసీలు ఈ పార్టీని ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు. మల్లన్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత కూడా కొత్త పార్టీ స్థాపనపై ఆలోచిస్తున్నట్లు టాక్ ఉంది. అధికారిక ప్రకటన చేయకపోయినా, ప్రస్తుతం తెలంగాణ జాగృతి పేరిట ప్రజల్లో చురుకుగా కదులుతున్నారు. కేసీఆర్ కుటుంబ అభిమానులను, బీఆర్ఎస్ లో అసంతృప్తులను తనవైపు తిప్పుకోవాలని కవిత ప్రయత్నం చేస్తున్నారు. అయితే తన తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీకి వ్యతిరేకంగా నిజంగా కవిత కొత్త పార్టీ పెడతారా ? అనే ప్రశ్న ఇంకా క్లారిటీ ఇవ్వలేదనే విషయం గమనార్హం.
ఇక రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు తమ బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. మల్లన్న తన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున, కవిత తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎవరి వల్ల ఎవరికీ లాభం, ఎవరికీ నష్టం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకరు కాంగ్రెస్ నుంచి, మరొకరు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యి కొత్త దారులు ఎంచుకోవడం, రెండు ప్రధాన పార్టీల ఓటు బ్యాంక్ను ఎటు తిప్పుతుందన్నది ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ ఇద్దరి భవిష్యత్ రాజకీయ సత్తాకు టెస్ట్గా మారనుంది.