తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత రాజకీయంగా ఎన్నో సంచలనాలు జరిగాయి..జరుగుతున్నాయి. అయితే జయలలిత కు వారసులు ఎవరు అన్నదానిపై ఇప్పటికీ రగడ కొనసాగుతూనే ఉంది. జయలలిత మేనకోడలు దీప ఒక్కరే ఆమె బ్లడ్ రిలేషన్ కాగా మిగతా వారందరూ రాజకీయ వారసులు మాత్రమే. అయితే జయలలిత మరణం తర్వాత ఆమెకు అసలైన వారసులం మేమంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆ మద్య ఓ మహిళ వచ్చింది..ఆమె ఎపిసోడ్ పూర్తి కాకుండానే మరో వ్యక్తి జయలలిత కొడుకును అంటూ తెరపైకి వచ్చాడు.
తాజాగా జయలలిత కుమారుడినని చెప్పుకుంటున్న జె.కృష్ణమూర్తి అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. జయలలిత కొడుకు అని చెప్పుకోవడంతో సోషల్ మీడియాలో ఈ విషయం పెద్ద సంచలనం అయ్యింది. దీనిపై స్పందించిన కొంత మంది అసలు విషయాన్ని బయటకు రాబట్టేందుకు ప్రయత్నించారు. అయితే జె.కృష్ణమూర్తి తాను జయలలిత కుమారుడినంటూ అతను సమర్పించిన డాక్యుమెంట్లన్నీ నకిలీవే అని పోలీసులు స్పష్టం చేయడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
జయలలిత, నటుడు శోభన్ బాబులకు తాను జన్మించానని... జయ ఆస్తులకు అసలైన వారసుడిని తానే అని ఇతను కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాదు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కూడా ఇతను కోర్టును కోరాడు. ఈ నేపథ్యంలో, కోర్టుకు అతను సమర్పించిన ధ్రువపత్రాలు సరైనవి కాదని పేర్కొన్న కోర్టు... అవి అసలైనవో, నకిలీవో పరిశీలించాలంటూ పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో, ఆ డాక్యుమెంట్లన్నీ నకిలీవే అని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో, అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.