టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. దానిని చూసి ఆనందపడాలా? లేకపోతే టెక్నాలజీ అభివృద్ధి కారణంగా ఎదురవుతున్న సమస్యలను చూసి బాధపడాలా? అర్థం కావడం లేదు. నిన్న మొన్నటివరకు కంప్యూటర్లు వచ్చి మన పనిని సగం వరకు తగ్గించేశాయి అని సంతోషపడ్డాం. కానీ, కంప్యూటర్ల కారణంగా ఒత్తిడి, కంటి చూపు తగ్గడం వంటి అనేక సమస్యలను ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. ప్రతి రోజూ కంప్యూటర్ ముందు కూర్చునే వారు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పుడిప్పుడే కొత్త టెక్నాలజీగా చాట్‌జిపిటి వచ్చింది. ఇది మన పనిని మరింత సులభం చేయడానికి ఉపయోగపడుతోంది. అయితే ఈ టెక్నాలజీని అవసరానికి కాకుండా, అనవసర విషయాలకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు:
“బాయ్‌ఫ్రెండ్‌కి, గర్ల్‌ఫ్రెండ్‌కి ఎలా ప్రపోజ్ చేయాలి?”..“భర్తను ఎలా ఇంప్రెస్ చేయాలి? అంటూ ప్రశ్నలు అడుగుతున్నారు. కొంతమంది తమ వర్క్‌కు సంబంధించిన పనులను కూడా చాట్‌జిపిటి సహాయంతో చేస్తున్నారు. ఇది మంచిదే. కానీ కొంతమంది మాత్రం దీన్ని నెగిటివ్‌గా వాడుతున్నారు.



“సూసైడ్ ఎలా చేయాలి?”, “మర్డర్ ఎలా చేయాలి?”, “ఒక అమ్మాయిని దారుణంగా ఎలా హింసించాలి?” వంటి భయంకరమైన ప్రశ్నలు కూడా కొందరు చాట్‌జిపిటిని అడుగుతున్నారు. ఇంకా కొంతమంది యువత చాట్‌జిపిటి ఇచ్చిన సమాధానాలను కూడా ఆచరిస్తున్నారు. ఇది చాలా కలవరపరిచే విషయం. ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఓపెన్‌ఏఐపై ఒక టీనేజర్‌ తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల 16 ఏళ్ల కుర్రాడు రైన్ ఆత్మహత్యకు చాట్‌జిపిటినే కారణమని, చాట్‌జిపిటి అతన్ని ఆత్మహత్య చేయడానికి ప్రేరేపించిందని ఆరోపిస్తూ, సాన్ ఫ్రాన్సిస్కో రాష్ట్ర కోర్టులో కేసు వేశారు.



ఆ బాలుడి తల్లి మాట్లాడుతూ..“లాభాల కోసం వినియోగదారుల భద్రతను కంపెనీ పట్టించుకోలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 11న రైన్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. మరణానికి ముందు కొన్ని నెలలుగా చాట్‌జిపిటితోనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఆత్మహత్య ఆలోచనల గురించి చాట్‌లో చర్చించేవాడు. ఈ సంభాషణల సమయంలో చాట్‌జిపిటి అతని ఆలోచనలను బలపరచడమే కాకుండా, ప్రాణాలు తీసుకునే విధానాలను కూడా వివరించిందని వారు ఆరోపించారు. తల్లిదండ్రులకు తెలియకుండా మద్యం ఎలా దొంగలించాలి..? ఆత్మహత్య ఎలా చేయాలి..? అనే విషయాలను కూడా చాట్‌జిపిటి స్పష్టంగా చెప్పిందని, అందుకే తమ కొడుకు ప్రాణాలు కోల్పోయాడని వారు కోర్టులో వాదించారు.



ఈ ఘటనపై ఓపెన్‌ఏఐ స్పందిస్తూ.."ఈ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తమ చాట్‌బాట్‌లో ఉన్న భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తామని ప్రకటించింది. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. యూజర్లను నెగిటివ్ దిశగా నడిపించే ఆప్షన్లను పూర్తిగా తొలగిస్తామని వెల్లడించింది"..!!

మరింత సమాచారం తెలుసుకోండి: