సాధారణంగా నిర్మాత హీరో ల మధ్య సత్సంబంధాలే ఉంటాయి. పెద్ద హీరోలకు ఇక చెప్పక్కర్లేదు. వారితో సినిమాలు తీసేవాళ్లు కూడా పెద్ద నిర్మాతలే గనుక.. వారి మధ్య ఎలాంటి అసంతృప్తులు కూడా సాధారణంగా ఉండవు. అయితే టాప్హీరోల్లో ఒకరైన మహేష్ బాబు మాత్రం.. తన పాత సినిమాల నిర్మాతల పట్ల ఒక రకరమైన కసితో వేగిపోతున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో ఒక సందర్భంలో.. ఒక ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ.. ''నాకు ఇప్పటిదాకా ఏ నిర్మాత కూడా.. ఒప్పందంచేసుకున్నంత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు'' అంటూ చెప్పడం కూడా ఈ సందర్భంలో గుర్తుకు వస్తోంది.
తాజాగా తన చిత్రం శ్రీమంతుడు విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో మహేష్బాబు ఒక విషయం వెల్లడించారు. ఈ చిత్రానికి జి.మహేష్బాబు ఎంటర్టైన్మెంట్ పేరిట ఆయనే సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమాలో క్వాలిటీ కోసమే తాను స్వయంగా ప్రొడక్షన్లోకి దిగినట్లుగా మహేష్బాబు చెప్పుకుంటున్నారు. సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు.. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండాలంటే.. తాను నిర్మాతగా మారానని, ఈ నిర్ణయం వెనుక మేజర్ ఎజెండా అదే అని ఆయన అంటున్నారు. అంటే దాని అర్థం.. ఇదివరకటి చిత్రాల్లో ప్రొడక్షన్ టైంలో క్వాలిటీ విషయంలో రాజీపడుతూ.. నిర్మాతలు తనను నానా పాట్లకు గురిచేసారనే అర్థమే వస్తోంది.
మహేష్ గత చిత్రాల నిర్మాతలు కూడా చిన్నవాళ్లేమీ కాదు. కానీ.. మహేష్లో వారి పట్ల ఏదో తెలియని కసి కూడా ఉన్నట్లున్నది. ఈ చిత్రంలో క్వాలిటీ దెబ్బతినకుండా ఉండడానికి ఏకంగా తానొక సొంత ప్రొడక్షన్ హౌస్ రిజిస్టర్ చేయించి ప్రారంభించాడంటే.. సదరు పాత నిర్మాతల మీద కసి ఏ రేంజిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మహేష్ గత చిత్రాలు కూడా ప్రొడక్షన్ వేల్యూస్ పరంగా బాగానే ఉంటాయి కదా.. మరి ఆయనకు అంతా చిరాకు ఎందుకు కలిగిందా అని అభిమానులు ఈ వ్యాఖ్యలు విని నివ్వెరపోతున్నారు.