తెలుగు రాష్ట్రాల్లోని సినీ ఎగ్జిబిటర్లు రెంటల్ విధానంలో సినిమాలను ప్రదర్శించబోమని జూన్ నెల 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ చేస్తామని కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తే మాత్రమే సినిమాలను ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. ఈరోజు నిర్వహించిన సమావేశానికి దాదాపుగా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారని తెలుస్తోంది. గత కొంతకాలంగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య పర్సెంటేజ్ విషయంలో చర్చ జరుగుతోంది.
 
ఇందుకు సంబంధించి నిర్మాతలకు లేఖ రాయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పర్సంటేజ్ విధానాన్ని మూడు భాగాలుగా నిర్ణయిస్తూ తెలంగాణ ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. 10 కోట్ల లోపు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు ఒక విధంగా, 10 నుంచి 30 కోట్ల లోపు నైజాం హక్కులు కలిగిన సినిమాకు మరో విధంగా, 30 కోట్ల కంటే ఎక్కువ మొత్తం నైజాం హక్కులు కలిగిన సినిమాలకు ఇంకో విధంగా పర్సంటేజ్ నిర్ణయించారు.
 
అయితే ఈ నిర్ణయం ఎఫెక్ట్ పడే పెద్ద సినిమా ఏదనే ప్రశ్నకు హరిహర వీరమల్లు పేరు జవాబుగా వినిపిస్తోంది. జూన్ నెల 12వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా సమస్య పరిష్కారం కాని పక్షంలో హరిహర వీరమల్లు మూవీ మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఏ సినిమా వాయిదా పడనన్ని సార్లు ఈ సినిమా వాయిదా పడిందనే సంగతి తెలిసిందే.
 
అయితే పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం అయిన నేపథ్యంలో ఆయన ఈ వివాదం విషయంలో జోక్యం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారితే ఇండస్ట్రీకి తీవ్రస్థాయిలో నష్టం కలుగుతుందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో అయినా ఈ పరిస్థితి మారుతుందేమో చూడాల్సి ఉంది. పవన్ ఈ సినిమా కోసం దాదాపుగా నాలుగేళ్ల సమయం కేటాయించారు. క్రిష్ జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: