దీపావళి రేసుకు వచ్చిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ ‘సర్కార్’ సినిమాలకు డివైడ్ టాక్ రావడంతో ఈరెండు సినిమాలు కలక్షన్స్ విషయంలో పెద్దగా సంచలనాలు చేయలేవు అన్న క్లారిటీ వచ్చేసింది. దీనితో ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ దృష్టి రజినీకాంత్ శంకర్ ల ‘2.0’ పై పడింది.
సుమారు 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందింపబడ్డ ఈమూవీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను తిరగ వ్రాస్తుంది అని అందరు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో తమిళనాడుకు చెందిన పైరసీ వెబ్ సైట్ తమిళ్ రాకర్స్ విసురుతున్న సవాల్ ‘2.0’ కు పెను ప్రమాదంగా మారబోతోంది.
ఇప్పటికే విశాల్ నటించిన ‘పందెంకోడి 2’ విజయ్ నటించిన సర్కార్ సినిమాలను తొలిరోజు తొలి ఆట ముగిసే సమయానికే తమ వెబ్ సైట్లో రిలీజ్ చేసి తమిళ రాకర్స్ కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని నిద్ర పోనీయకుండా చేస్తోంది. ఇప్పుడు ఈ వెబ్ సైట్ ‘2.0’ మూవీని సవాల్ చేస్తూ పెట్టిన ట్విట్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అన్న వార్తలు వస్తున్నాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘2.0’ మూవీని త్వరలో విడుదల చేస్తున్నాము అంటూ తమిళ రాకర్స్ పెట్టిన ట్విట్ ఇప్పుడు సంచలనంగా మారింది. కోలీవుడ్ హీరో విశాల్కు, తమిళ రాకర్స్ పైరసీ దారులకు మధ్య భారీ యుద్ధమే జరుగుతున్న నేపధ్యంలో ఈయుద్ధానికి రజినీకాంత్ కూడ సపోర్ట్ చేయడంతో ‘2.0’ పై కూడ తమిళ రాకర్స్ పైరసీ వెబ్ సైట్ టార్గెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 600 కోట్లతో 3డీ టెక్నాలజీలో రూపొందింపబడ్డ ఈమూవీకి పైరసీ ప్రమాదం ఎదురైతే వందల కోట్ల స్థాయిలో నష్టాలు ఉంటాయి అన్న ప్రచారం జరుగుతోంది. దీనితో జరుగుతున్న పరిణామాల పై రజినీకాంత్ శంకర్ లు తీవ్ర అందోళనలో ఉన్నట్లు టాక్..