రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు దిగిరానున్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశముందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల తగ్గుదలలో వచ్చే లాభాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నామని వివరించారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఏప్రిల్ నెలలో పరిశీలిస్తే రూ.10 మేర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో రేట్ల తగ్గుదల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే గ్యాస్ సిలిండర్ ధర దిగివచ్చిందనే చెప్పాలి.
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.809 గా ఉంది. అదే ఇక్కడ మన ఊరిలో ఎల్పీజీ సిలిండర్ కొనుగోలు చేయాలంటే రూ.900 దాక చెల్లించుకోవాల్సిందే. ఈ ఏడాది గ్యాస్ ధరను ఒకసారి పరిశీలిస్తే ఫిబ్రవరి, మార్చి నెలలో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.125 మేర పెరిగింది. పెరగడం అయితే భారీగా పెరిగింది కానీ తగ్గడం మాత్రం కేవలం రూ.10 మాత్రమే తగ్గడం గమనార్హం.నిజంగానే గ్యాస్ ధరలు తగ్గితే సామాన్యుడిపై కొద్దిగా అన్నా భారం తగ్గుతుంది అనే చెప్పాలి