అతనో సేల్స్ మెన్... అతడు నెల రోజులుపాటు కష్టపడితే అందుకు ప్రతిఫలంగా యజమాని చెల్లించేది రూ.1,200. కానీ అనూహ్యంగా అతడు కోట్లాధిపతి అయ్యాడు. కాదు కాదు.. అతడు కోటీశ్వరుడని ప్రభుత్వ అధికారులు తేల్చారు. అయితే అతని వద్ద బొలేరో, ఆల్టో కార్లు, యాక్టివా, షైన్ ద్విచక్రవాహనాలు ఉన్నాయి. సంవత్సర సంపాదనతో పోలిస్తే ఏకంగా 200 రెట్లు అక్రమంగా కూడబెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. సిధి జిల్లాలోని ఓ చిన్న దుకాణంలో సేల్స్ మెన్ గా ఉన్న సురేష్ ప్రసాద్ పాండే ఆస్తులపై ఎవరో లోకాయుక్త అధికారులకు ఉప్పందించారు.
లోకాయుక్త అధికారులు అతడి ఇంటిపై దాడిచేసిన తర్వాత గానీ ఈ విషయం లోకానికి తెలియలేదు. సురేశ్ ప్రసాద్ పాండే అనే వ్యక్తి మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో ఓ చిన్న దుకాణంలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. అతడి నెల జీతం రూ.1200. అయితే, అతడి వద్ద అక్రమ ఆస్తులు చాలా ఉన్నాయని స్థానిక లోకాయుక్త అధికారులకు సమాచారం అందడంతో అనూహ్యంగా వారు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిజంగానే అతడి వద్ద కోట్ల విలువ చేసిన ఆస్తులు ఉన్నట్లు స్థిర, చర ఆస్తుల పత్రాలు లభించాయి.
వీటితోపాటు ఒక బొలేరో, ఆల్టో కార్లను, యాక్టివా, హోండా షైన్ బైక్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడి సంవత్సర సంపాధన కంటే 200 రెట్లు ఆస్తులు గుర్తించామని అధికారులు వెల్లడించారు. పాండే, అతడి కుమారుడు, భార్య పేరిట మొత్తం 8 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. దీంతో వారు దాడులు నిర్వహించి సోదాలు చేసి అవాక్కయ్యారు. ఇప్పుడిక ఇంత ఎలా సంపాదించాడన్న విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు.