మూడేళ్ల క్రితం ఘోర రోడ్డు ప్రమాదంలో భార్య శోభను కోల్పోయిన నాగిరెడ్డి ఇప్పుడు తాను కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయారు. కూతురు అఖిలప్రియ ఆయన అండదండలతో రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో సంభవించిన ఈ విషాదం నుంచి ఆ కుటుంబం ఇప్పట్లో కోలుకోవడం కష్టమేననిపిస్తోంది. వాస్తవానికి చిన్న వయసులోనే అంటే 53 ఏళ్లకే భూమా నాగిరెడ్డి చనిపోవడం అత్యంత విషాదకరమే. ఫ్యాక్షన్ రాజకీయాలకు నిల యమైన కర్నూలు జిల్లాలో, అందులోనూ ఆళ్లగడ్డలో అఖిలప్రియ రాజకీయంగా తట్టుకొని నిలబడగలదా? ఆమెకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ పూర్తి సహాయం చేయాల్సివుంటుంది. కానీ చేస్తారా?
రాజకీయంగానే కాకుండా ప్రత్యర్థుల బారి నుంచి ఆమెను కాపాడాల్సివుంటుంది. భూమా నాగిరెడ్డికి సంబం ధించి చెప్పుకోవాల్సిన విశేషమేమిటంటే టీడీపీ ద్వారానే రాష్ట్ర రాజకీయాల్లోకి (ఉమ్మడి రాష్ట్రంలో) అడుగు పెట్టిన ఆయన అదే టీడీపీలో చేరిన కొంతకాలానికే కన్నుమూశారు. అంటే ఆయన తుది మొదలు మాత్రం టీడీపీయే. భూమా పార్టీలో చేరగానే చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇస్తానని వాగ్దానం చేశారు. మంత్రి కావాలనేది భూమా నాగిరెడ్డి కోరిక కూడా. మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ అదుగో ఇదుగో అంటూ బాబు వాయిదా వేస్తూ వచ్చారు.
ఈలోగా భూమా హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన పోయినా బాబు ఇచ్చిన 'మంత్రి పదవి' హామీ అలాగే ఉంది. అఖిలప్రియకు పదవి ఇచ్చి భూమా కోరిక నెరవేరుస్తారా? లేదా రాజకీయంగా, ఇతరత్రా ఏమైనా అడ్డంకులు వస్తాయా? వస్తే ఆయన ఏలా అదిగమిస్తారు? ఇంతకీ అఖిలప్రియకు మంత్రి పదవి ఇస్తారా లేదా అన్నది కూడా అనుమానమే. ఇక భూమ నాగిరెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ఒక్కసారి గమనిస్తే... 1984లో సహకార సంఘం అధ్య క్షుడిగా ఎన్నిక కావడంతో రాజకీయాల్లోకి వచ్చిన భూమా ఆ తరువాత ఆళ్లగడ్డ మండలాధ్యక్షుడయ్యారు. దీని తరువాతే ఆయన అసలు రాజకీయ జీవితం ప్రారంభమైంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సోదరుడు భూమా శేఖర రెడ్డి చనిపోవడంతో 1991లో ఆళ్లగడ్డకు జరిగిన ఉప ఎన్నికలో నాగిరెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడది ప్రతిపక్షం. ఆయన చనిపోయే సమయానికి మళ్లీ టీడీపీలోనే ఉన్నారు. ఇప్పుడది అధికార పక్షం. అయితే ఆయన వైకాపా నుంచి టీడీపీలోకి జంప్ చేసినా ఆ పార్టీ నుంచి వచ్చిన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయలేదు కాబట్టి నైతికంగా ఆయన జగన్ పార్టీ ఎమ్మెల్యే అవుతారు. కాని పార్టీ మారారు కాబ్బట్టి అందరూ టీడీపీ ఎమ్మెల్యేగానే భావించాలి. 1996లో భూమా పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది.
కారణం... నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు వ్యతిరేకంగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం. కాని కొద్ది తేడాతో ఓడిపోయారు. అయితే పీవీ నంద్యాలతోపాటు ఒడిశాలోని బరంపురం నుంచి కూడా పోటీ చేసి అక్కడా గెలిచారు. దీంతో నంద్యాలకు రాజీనామా చేశారు. దీంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికలో మళ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెసు అభ్యర్థి రంగయ్య నాయుడిని నాలుగు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఓడించారు. దీంతో భూమా బలమైన నాయకుడిగా అవతరించి మొదటిసారిగా లోక్సభలో కాలుపెట్టారు.
ఆ తరువాత మరో రెండుసార్లు లోక్సభకు ఎన్నికై రాయలసీమలో భూమాను దెబ్బతీసేవాడు లేడనే అభిప్రా యం కలిగించారు. ఆయన టీడీపీ నుంచి పెద్ద నాయకుడిగా ఎదిగినప్పటికీ 2008లో ఆ పార్టీని వదిలేసి చిరం జీవి ప్రజారాజ్యంలో చేరారు. 2009 ఎన్నికల్లో ఆయన, భార్య శోభ ప్రజారాజ్యం నుంచి పోటీ చేయగా ఆమె గెలి చింది. ఆయన ఓడిపోయారు. 2011లో వైఎస్సార్సీపీలోకి వచ్చారు. 2014 ఎన్నికల్లోనే శోభ చనిపోయారు. ఆమె స్థానంలో కూతురు అఖిలప్రియ ఎమ్మెల్యేగా గెలిచింది. గత ఏడాది తండ్రీ కూతురు టీడీపీలోకి వచ్చేశారు. అఖిలప్రియను మంత్రి వర్గంలోకి తీసుకోకుంటే భూమా వర్గం ఎలా స్పందిస్తుంది? ఈ ప్రశ్నలకు ఎలాంటి జవాబులు వస్తాయో మరికొన్ని రోజులు వేచి చూడాలి.