ఎన్డిఎ ప్రభుత్వం పై అవిశ్వాసాన్ని ఎందుకు ప్రతిపాదించారో కారణం చెప్పలేక పోయారని, ఆ లోపం కనిపించ నీయకుండా ఉండేందుకే రాహుల్ గాంధి తనను హత్తు కుని నాటకమాడారని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో శనివారం జరిగిన కిసాన్ కళ్యాణ్ ర్యాలీ లో నరెంద్ర మోడీ మాట్లాడుతూ అవిశ్వాసం ప్రతిపాదించడానికి గల కారణాలు అడిగామని ప్రతిపక్షా లు తమకు సమాధానం ఇవ్వడంలో ఘోరంగా విఫలం అయ్యాయని, చివరకు తాను అనుకోని విధంగా ఆలింగనం ఒక్కటే తనకు కనిపించిందని మోడీ ఎద్దేవా చేసారు.
అవిశ్వాసం ప్రతిపాదనలో తన ప్రసంగం ముగించిన తర్వాత నేరుగా ప్రధాని మోడీ స్థానం వద్దకు వెళ్లి అనూహ్యంగా ఆయన్ను కౌగలించుకున్నారు. టిడిపి ఆధ్వర్యంలో ప్రతిపాదించిన ఈ అవిశ్వాస తీర్మానాన్ని వివిధ ప్రతిపక్షాలు సమర్ధించిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీ బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డిఎ ప్రభుత్వం ఈ అవిశ్వాసాన్ని మూడొంతుల మెజార్టీతో నెగ్గింది.
బిజెపికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలన్నీఏకం అయినా అవిశ్వాసంలో ప్రభుత్వమే నెగ్గిందని ప్రధాని పేర్కొన్నారు. పేదలను విస్మరించారని, యువత, రైతులను సైతం నిర్లక్ష్యం చేసారని నరేంద్ర మోడీ ప్రధానంగా కాంగ్రెస్ పైనే ధ్వజ మెత్తారు.
ఒక్కొక్క పార్టీ మరో పార్టీతో కలిసి ప్రతిపక్షానికి వచ్చాయని, ఈ పార్టీ లన్నీ చిత్తడి నేల వంటివి అయితే ఆ భూమిలో కమలం వికసిస్తుందని నరేంద్ర మోడీ చెప్పారు. కమలం బిజెపికి అధికార గుర్తు అన్న సంగతి తెలిసిందే. రైతులకు సహకరించేందుకు గత పాలక ప్రభుత్వాలకు చిత్త శుద్ధి కరువయిందని అన్నారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన కీలక నిర్ణయాల ను ఆయన ఏకరువుపెట్టారు.