ఎన్నికలు, ప్రచారం, పోలింగ్, ఈ మూడు విషయాల్లోనూ పార్టీలకు ఎంతో క్లారిటీ ఉంటుంది. ఎవరికి అవకాశం ఇవ్వాలి? ఎ వరు గెలుపు గుర్రాలుగా ఉన్నారు? ఎవరు విజయం సాధిస్తారు? అనే అంచనాలు వేసుకుని ముందుకు సాగతాయి పార్టీ లు. ఇక, టికెట్ కేటాయించడంతోనే పరిస్థితికి బ్రేక్ పడదు. ప్రచారంలో దూకుడు ప్రదర్శించాలి. అయితే, ఇది ఒక్కటే అభ్యర్థిని నిలబెడుతుందా? అంటే అది కూడా కష్టమే. పోల్ మేనేజ్మెంట్లో దూకుడు చూపించాలి. ఇలా ఎక్కడా కూడా అలసత్వం లేకుండా ముందుకు సాగినప్పుడు మాత్రమే విజయం అనేది సాధ్యమవుతుందని అంటారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార టీడీపీ దాదాపు 20 స్తానాల్లో చేతులు ఎత్తేసినట్టు తెలుస్తోంది.
అభ్యర్థుల ఎంపిక విషయంలో బాగానే ఉన్నప్పటికీ... ప్రచారంలో దూకుడు పెంచినప్పటికీ.. పోల్ మేనేజ్ మెంట్ సహా ప్రజలకు దగ్గర కావడంలో టీడీపీ పూర్తిగా విఫలమైందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. వీటిలో కృష్ణాజిల్లా తిరువూ రు సహా విజయవాడ తూర్పు నియోజకవర్గం కూడా ఉండడం గమనార్హం. వాస్తవానికి విజయవాడ తూర్పు టీడీపీకి కంచు కోట. అయితే, ఇక్కడ ప్రచారం బాగున్నా.. అభ్యర్థి బాగున్నా.. పోల్ మేనేజ్మెంట్లో మాత్రం టీడీపీ వెనుకబడింది. దీంతో టీడీపీ గెలుపుపై ఇక్కడ అనేక సందేమాలు నెలకొన్నాయి. అదేవిధంగా టీడీపీకి మరో కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఇక్కడ నుంచి బరిలోనిలిచిన అనిత స్థానికేతరురాలు. అయినా కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేసినా.. ప్రచారంలో బాగు న్నా.. స్థానికంగా ప్రజలను ఆకట్టుకోవడంలోను ఆర్థికంగా ప్రజలకు చేరువ కావడంలోను అనిత పూర్తిగా విఫలమయ్యారు., దీంతో ఇక్కడ కూడా టీడీపీ గెలుపుపై ఆశలు లేకుండా పోయాయి. అదేవిధంగా అనంతపురం పట్టణ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వైసీపీ నాయకులు ప్రజలకు చేరువ అయ్యారు. ఇలామొత్తంగా 20 స్థానాల్లో టీడీపీ బొక్క బోర్లా పడిందని ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియాలోనూ కథనాలు వచ్చాయంటే .. వాస్తవ పరిస్థితి మరింత ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఎలా ఉన్నప్పటికీ.. రాష్ట్ర వ్యాప్తంగా 20 స్థానాల్లో ఫలితాలకు ముందుగానే టీడీపీ చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు.
ఆ 20 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఎన్నికల వ్యూహంలో ప్రత్యర్థి కంటే వెనుకంజలో ఉన్నట్లు తెలిసింది. కొందరికి ఆర్థిక ఇబ్బందులు, మరికొందరిలో ధీమా దీనికి కారణంగా తెలుస్తోంది. పసుపు-కుంకుమ పథకం కింద మహిళలకు ప్రభు త్వం తరఫున ఇచ్చిన రూ.10 వేలు తమకు సానుకూల ఓటును తెస్తుందన్న విశ్వాసం తెలుగుదేశం అభ్యర్థుల్లో బలంగా ఉంది. మహిళా ఓటుబ్యాంకు తమకేనన్న వాతావరణమూ కనిపించింది. దీంతో కొందరు అభ్యర్థులు ఎన్నికలను కాస్త తేలిగ్గా తీసుకున్నారని అంటున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం ఆర్థిక ఇబ్బందులతో వైసీపీతో సమంగా ఎన్నికల ఖర్చు చేయలేకపోయామని అభ్యర్థులే చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి స్థానాల్లో ఫలితం ఏమవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ సందిగ్ధానికి తెరపడాలంటే మే 23 వరకు వెయిట్ చేయకతప్పదు.