తెలుగుదేశం పార్టీని మరోసారు ఆగస్టు సెంటిమెంట్ వణికిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆగస్టు నెల వస్తుందంటేనే తెలుగు తమ్ముళ్లకు చెమటలు పడుతుంటాయి. ఎటునుంచి ఎవరు పార్టీకి ఎసరు పెడతారో అన్న సందేహం అందరికి ఉంటుంది. ఎందుకంటే ఆగస్టు నెలలోనే ఆ పార్టీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. 1983లో పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి ఆగస్టులోనే చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. 1983 జనవరి 9వ తేదీన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు, గుండె ఆపరేషన్ కోసం 1984లో అమెరికా వెళ్లారు. ఆ టైంలోనే నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్కు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీశారు.
నాదెండ్ల సంక్షోభం టీడీపీకి ఆగస్టు నెల పుట్టించిన మొదటి భయం. ఆ తర్వాత రెండుసార్లు అదే నెలలోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఇక ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి గద్దె దింపింది కూడా ఈ నెలలోనే. చంద్రబాబు నాయుడు, స్వయంగా 1995 8వ నెలలోనే వెన్ను పోటు పొడిచారు. ఆ బ్యాడ్ సెంటిమెంట్ అక్కడితోనే ఆగలేదు.
ఇక చంద్రబాబుకు ఈ నెలలో తిప్పలు తప్పలేదు. 2000 సంవత్సరం ఆగస్టులో జరిగిన బషీర్బాగ్ కాల్పుల ఘటన, ఆ తర్వాత 2004లో చంద్రబాబు సీఎం పదవికి ఎసరు తెచ్చింది. ఈ సంఘటన తర్వాత చంద్రబాబు కూడా కీలక నిర్ణయాలేవీ ఆ నెలలో తీసుకునే వారు కాదట. ఇక 2009లో కూడా చంద్రబాబు అధికారంలోకి రాకపోవడం, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, 2014 ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబును ఆగస్టు అంతగా ఇబ్బంది పెట్టలేదు.
అయితే టీడీపీ శ్రేణులను మాత్రం ఈ భయం వెంటాడుతోంది. తాజాగా పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు బీజేపీ టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసుకుంటామంటూ సవాళ్లు రువ్వుతోంది. ఇది ఆగస్టు తొలి వారంలోనే జరుగుతోందన్న ప్రచారం చంద్రబాబును బాగా టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారిపోయారు. పలువురు ఎమ్మెల్యేలు ఇదే బాటలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టీడీపీని ఆగస్టు సెంటిమెంట్ టెన్షన్ పెట్టేస్తోంది.