దశాబ్దాల పాటు దేశాన్ని కుదిపేస్తున్న రామజన్మ భూమి
వివాదాస్పద స్ధలాన్ని అయోధ్య ట్రస్టుకు కేటాయించాలని సుప్రింకోర్టు ఐదుగురు సభ్యుల
ధర్మాసనం అంతిమ తీర్పు చెప్పింది. సుప్రింకోర్టు తాజా తీర్పుతో దాదాపు 165
సంవత్సరాల వివాదానికి ముగింపు పలికినట్లే భావించాలి. రామజన్మభూమి పేరుతో ఉన్న 65 ఎకరాల వివాదాస్పద
స్ధలాన్ని అయోధ్య ట్రస్టుకు వెంటనే అప్పగించాలని ధర్మాసనం స్పష్టంగా ఆదేశించింది.
అలాగే మూడు నెలల్లో అయోధ్య ట్రస్టును కేంద్రం ఏర్పాటు చేయాలని కూడా సుప్రింకోర్టు ఆదేశాలను జారీ చేసింది. అయోధ్య ట్రస్టుకు వివాదాస్పద స్ధలాన్ని అప్పగించాలని చెప్పిన సుప్రింకోర్టు మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా మరో స్ధలాన్ని కేటాయించాలని చెప్పింది. పైగా రామమందిర్ నిర్మాణానికి దర్మాసం తీర్పుతో లైన్ క్లియర్ అయినట్లే అనుకోవాలి.
మొత్తం మీద వివాదాస్పద రామజన్మభూమి రామజన్మభూమి న్యాస్ కే చెందుతుందని కూడా చెప్పేసింది. మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్ధలాన్ని కేటాయించాలని సూచించింది. ఈ స్ధలాన్ని కేంద్రమైనా లేకపోతే రాష్ట్రప్రభుత్వం కేటాయించినా అభ్యంతరం లేదని కూడా చెప్పింది. మూడు నెలల్లో వివాదాస్పద స్ధలం ట్రస్టుకు అందితే తర్వాత నిర్మించబోయే రామమందిరం, నిర్వహణ మొత్తం ట్రస్టు ఆధ్వర్యంలోనే జరుగుతుందనటంలో సందేహం లేదు.
సుప్రింకోర్టు తాజా తీర్పుతో దాదాపు 165 ఏళ్ళుగా వివాదాల్లో నలుగుతున్న సుదీర్ఘ వివాదానికి ముగింపు పలికినట్లైంది. తీర్పు చెప్పిన ధర్మాసనం తమ తీర్పును మత విశ్వాసాలు, ప్రజల నమ్మకాలతో కాకుండా అందుబాటులో ఉన్న సాక్ష్యాలు, ఆర్కియలాజికల్ సర్వే శాఖ చూపించిన ఆధారాలను పరిశీలించిన తర్వాతే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు రంజన్ స్పష్టంగా చెప్పారు.
వివాదాస్పద స్ధలాన్ని ట్రస్టుకు అప్పగించటానికి మూడు మాసాల గడువు ఇచ్చిన సుప్రింకోర్టు మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్ధలం కేటాయించటానికి కూడా మూడు నెలలే గడువు ఇవ్వటం గమనార్హం. అంటే మందిరమైన మసీదైనా తమకు ఒకటే అన్న సూక్ష్మాన్ని ధర్మాసనం జనాల్లో కలిగించింది.