కొన్ని సంఘటనలు నమ్మశక్యంగా ఉంటాయి. ఆలస్యంగా అవి తెరమీదకు వచ్చినప్పుడు అంతే వివాదాస్పదం కూడా అవుతుంటాయి. తాజాగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విషయంలో అదే జరిగింది. ఈ దివంగత నాయకురాలి గురించి ఊహించని విషయం తెరమీదకు వచ్చింది. మాఫియాడాన్ కరీంలాలాతో ఇందిరాగాంధీకి పరిచయం ఉండటమే కాకుండా...ఆమెను ప్రభావితం చేసేలా సదరు డాన్ వ్యవహరించాడానేది తాజా వివాదం.
మీడియాలో ప్రముఖంగా కనిపించే శివసేన ఎంపీ సంజయ్రౌత్ తాజాగా సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబైలో మాఫియా డాన్తో ఇందిరాగా అప్పుడప్పు డూ భేటీ అయ్యేవారని తెలిపారు. 1960-1980 మధ్య ముంబైని ఏలిన ముగ్గురు మాఫియా డాన్లలో కరీంలాలా ఒకడు. మిగిలిన ఇద్దరు మస్తాన్ మీర్జా అలియాస్ హాజీ మస్తాన్, వరదరాజన్ మొదలియార్. ‘ముంబై పోలీస్ కమిషనర్గా ఎవరు ఉండాలో, సచివాలయంలో ఎవరు ఉండాలో మాఫియా డాన్ లు నిర్ణయించేవారు. హాజీ మస్తాన్ సచివాలయానికి వస్తే అధికారులంతా ఆయనను కలుసుకునేందుకు వచ్చేవారు. దక్షిణ ముంబైలోని పైధోనీలో కరీంలాలాను ఇందిర అప్పుడప్పు డు కలుసుకునేవారు’ అని లోక్మత్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్రౌత్ చెప్పారు. ఈ కామెంట్లు తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి.
శివసేనతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, రౌత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దివంగతులైన ప్రధానులపై బురదజల్లకుండా రాజకీయ నేతలు సంయమనం పాటించాలని మిలింద్ దేవ్రా సూచించారు. రౌత్ తప్పుడు వ్యాఖ్య చేసి ఉంటే పశ్చాత్తాపపడాల్సి వస్తుందని సంజయ్ నిరుపమ్ అన్నారు. సంజయ్ రౌత్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ థోరట్ చెప్పారు. ఈ వ్యాఖ్యలను తాము సహించబోమని స్పష్టం చేశారు.
ఇలా కలకలం రేగడం, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడటంతో రౌత్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. కొందరు తన మాటలను వక్రీకరించారని తెలిపారు. ‘నా మాటలు ఇందిర ప్రతిష్ఠను దిగజార్చాయని/తమ మనోభావాలను బాధపెట్టాయని ఎవరైనా భావిస్తే.. నేను ఆ వ్యాఖ్యలను వెనుకకు తీసుకుంటున్నా’ అని చెప్పారు. కాగా, మాజీ సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీకి ముంబై మాఫియా నిధులు అందజేసిందా అంటూ సందేహం వ్యక్తం చేశారు. కాగా రౌత్ విషయంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే అసంతృప్తిని తెలియజేసినట్లు సమాచారం.