రాష్ట్రంలో ఎల్లోమీడియా బాధ అంతా ఇంతా అని చెప్పలేకున్నారు. ఒకవైపు చంద్రబాబునాయుడును గుక్క తిప్పుకోనీయకుండా జగన్మోహన్ రెడ్డి వాయించేస్తున్నారు. 13 జిల్లాలోని రాష్ట్రంలో ఎక్కడ కూడా టిడిపి కోలుకుంటున్న దాఖలాలు కనబడటం లేదు. పనిలో పనిగా శాసనమండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటుతో జగన్ దూసుకుపోతున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబును రక్షించటం కోసం ఎల్లోమీడియా వెంటనే రంగంలోకి దిగేసింది.
చంద్రబాబు మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ పై ఐటి దాడులు జరగటం నిజంగా సంచలన వార్తే అనటంలో సందేహం లేదు. కానీ ఎక్కడా దానికి సంబంధించిన వార్త మొదటి పేజీలో ఎక్కడా కనబడలేదు. పైగా జరిగిన ఐటి దాడిని కప్పి పెడుతూ ’అయ్యో...ఐటి’ అంటూ తప్పుడు కథనం అచ్చేసింది. ఈ హెడ్డింగ్ చదివిన వారికి ఐటి కంపెనీలకు దెబ్బ అంటూ అర్ధమవుతుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఐటి కంపెనీలకు ఎక్కడా దెబ్బ తగల్లేదు. మాజీ పిఎస్ పై జరిగిన ఐటి దాడుల సమాచారాన్ని డైవర్ట్ చేయటానికే ఇటువంటి బోగస్ కథనాన్ని అచ్చేసినట్లు అర్ధమైపోతోంది. పైగా అనంతపురంలో కియా కార్ల ఉత్పత్తి ప్లాంటు తమిళనాడుకు తరలిపోతోందంటూ అంతర్జాతీయ మీడియా సంస్ధ రాయటర్స్ లో వచ్చిన కథనం తప్పుడదని తేలిపోయింది. కియా మోటార్స్ తరలింపు కథనం ఎంత తప్పుడుదో శ్రీనివాస్ ఇల్లు, ఆఫీసులపై ఐటి దాడులు అంతే సంచలనం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వాస్తవాలను కప్పి పుచ్చేందుకు తప్పుడు కథనాలను అచ్చేస్తు, జరుగుతున్న విషయాలను జనాలకు తెలీకుండా ఎల్లోమీడియా నానా అవస్తలు పడుతున్న విషయం తెలిసిపోతోంది. అయినా ఎల్లోమీడియా చెప్పకపోతే జరుగుతున్నదేమిటి ? వాస్తవాలేమిటి ? అన్నది జనాలకు తెలీకుండానే ఉంటుంది. అన్నీ వైపుల నుండి ఎల్లోమీడియాను సోషల్ మీడియా కుమ్మేస్తున్నా ఇంకా జ్ఞానోదయం కలగకపోవటమే విచిత్రం.