తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్మన్ నియామకంలో ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. వైసీపీ ప్రభుత్వం తీరు వింతగా ఉందని అన్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వం జీవోను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. వేరే మతం వారిని ట్రస్ట్ చైర్మన్ గా నియమిస్తే సమస్యలు వస్తాయని చెప్పారు. చైర్మన్ నియామకం విషయంలో ప్రభుత్వ తీరుపై అశోక్ గజపతిరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు.
105 ఆలయాలు మాన్సాన్ ట్రస్ట్ పరిధిలో ఉన్నాయని చెప్పారు. ఆలయాలకే దాతల భూములు చెందేలా చేయాలని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ దేవాదాయ భూములపై కన్నేసిందని ఆరోపణలు చేశారు. రెండు రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వం మాన్సాన్ ట్రస్ట్ ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించి ఆనంద్ గజపతిరాజు కుమార్తె సంచయిత గణపతిరాజును ఛైర్మన్ గా నియమించింది.
ప్రభుత్వం వారసుల వంతులో భాగంగా ఆమెను నియమించింది. కొన్ని రోజుల క్రితం సంచయితకు జగన్ ప్రభుత్వం సింహాచలనం ఆలయ పాలక సభ్యురాలిగా నామినేటెడ్ పదవి ఇచ్చింది. జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి సంచయిత గతంలో మద్దతు ప్రకటించింది. 2018 అక్టోబర్ నెలలో ఈమె బీజేపీలో చేరింది. ప్రస్తుతం ఆమె బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.
మాన్సాన్ ట్రస్టును 1958 సంవత్సరంలో దివంగత పివిజి రాజు నెలకొల్పి 1994 వరకు వ్యవస్థాపక చైర్మన్ గా ఉన్నారు. 1994లో పివిజి రాజు మరణం తరువాత ఆనంద గజపతిరాజు చైర్మన్ కాగా మూడేళ్ల క్రితం ఆయన మరణించారు. ఆయన మరణం తరువాత అశోక్ గజపతిరాజు చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. వైసీపీ తాజాగా ఆయనను తొలగించి సంచయిత గజపతిరాజును చైర్మన్ గా నియమించడంతో వివాదం మొదలైంది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఈ విషయంపై వైసీపీ తీరును తప్పుబట్టింది.