దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగతుంది. ఈ తర్వాత లాక్డౌన్ను పొడిగించాలా..? వద్దా..? అని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుండగానే.. పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో ఒక్కరోజే 20 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ను పొడిస్తున్నట్లు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బుధవారం ప్రకటించారు. పంజాబ్ లో ఇప్పటివరకు మొత్తం 99 కవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 8 మంది మరణించారు. 14మంది ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. పంజాబ్ లో ఇప్పటివరు 2,559 నమూనాలను పరీక్ష చేయగా, 2,204 శాంపిల్స్ నెగిటివ్ వచ్చాయి. ఇంకా 256 శాంపిల్స్ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. దేశవ్యాపంగా ఏప్రిల్-14తో లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో పంజాబ్ తీసుకున్న నిర్ణయం కొంత చర్చనీయాంశంగా మారుతోంది. కేంద్రకంటే ముందుగానే నిర్ణయం తీసుకోవడం కొంతవరకు తొందరపాటు నిర్ణయమేనని పలువురు అంటున్నారు. నిజానికి.. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం కొనసాగించే అవకాశాలే కనిపిస్తున్నాయి. బుధవారం ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్పక్ష నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లోనూ కీలక విషయాలు వెల్లడించారు. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చేవరకూ లాక్ డౌన్ కొనసాగించాలని భావిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. లాక్ డౌన్ ఎత్తివేయాల్సి వస్తే దశలవారీగా తొలగించే యోచనలో కేంద్రం ఉంది. లాక్ డౌన్ కొనసాగింపుపై పార్లమెంటరీ పక్ష నేతలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టతనిచ్చారు. ఇప్పట్లో లాక్డౌన్ను ఎత్తేసే అవకాశం లేదని చెప్పారు. ఈ నెల 11న స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజానికి.. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మరికొందరు ముఖ్యమంత్రులు లాక్డౌన్ను కొనసాగించాలని సూచించారు.