ప్రధానమంత్రి నరేంద్రమోడి అంటే వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మొహన్ రెడ్డి నిజంగానే అంతగా భయపడుతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మొదటి నుండి అధికార తెలుగుదేశంపార్టీ నేతలు కూడా జగన్ పై అదే విధమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆ విషయంలో వైసిపి నుండి స్పష్టమైన సమాధానం లేకపోయినా ఆరోపణలు తప్పని నిరూపించుకునేందుకు నానా అవస్తలు పడుతున్నారు.
బిజెపి, టిడిపి కుమ్మక్కు రాజకీయాలు
అయితే, తాజాగా అంటే ఢిల్లీ కేంద్రంగా గడచిన రెండు రోజుల పరిణామాలను గమనించిన వారికి మాత్రం ప్రధాని అంటే జగన్ భయపడుతున్నారా అన్న సందేహాలు మొదలయ్యాయి. బడ్జెట్ సమావేశాల్లో కేంద్రప్రభుత్వంపై వైసిపి, టిడిపిలు అవిశ్వాస తీర్మానాలు అందచేశాయి. అయితే, వివిధ కారణాలు చెప్పి నోటీసులను స్పీకర్ తిరస్కరించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మొదలైన వర్షాకాల సమావేశాల మొదటి రోజే టిడిపి అందచేసిన నోటీసును స్పీకర్ అడ్మిట్ చేసుకున్నారు. దాంతో బిజెపి, టిడిపిలు కుమ్మక్కయ్యాయనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి.
ప్రధానిపై ఎందుకు మాట్లాడటం లేదు ?
అవే విషయాలను వైసిపి నేతలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వరప్రసాద్, అంబటి రాంబాబు తదితరలు పదే పదే ఆరోపిస్తున్నారు. అంత వరకూ బాగానే ఉంది. మరి, పార్టీ అధ్యక్షుడైన జగన్ జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను చెప్పాలి కదా ? మరి ఎందుకు నోరు మెదపటం లేదు ? బిజెపి, టిడిపిలు కుమ్మక్కయ్యాయంటే నరేంద్రమోడి ఆమోదం లేకుండానే సాధ్యమవుతుందా ? కానీ వైసిపి నేతలు ఒక్క చంద్రబాబునాయుడును మాత్రమే లక్ష్యంగా ఎందుకు చేసుకుంటున్నారు ? రెండు పార్టీలు కలిసి రాష్ట్రప్రజలను మోసం చేస్తున్నాయన్న వైసిపి నేతల ఆరోపణల్లో ప్రధానమంత్రి పాత్రెంత ?
ప్రధాని అంటే భయపడుతున్నారా ?
జరుగుతున్న పరిణామాల్లో యావత్ వైసిపి నేతలు ఒక్క చంద్రబాబును మాత్రమే లక్ష్యంగా చేసుకుంటూ నరేంద్రమోడి గురించి మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. అంటే ఇక్కడ మ్యాటర్ వెరీ క్లియర్. ప్రధానమంత్రి అంటే జగన్ భయపడుతున్నారన్నది అందరికీ అర్దమైపోతోంది. ఎందుకంటే, జగన్ పై ఉన్న కేసులే ప్రధాన కారణం. కేసులు, విచారణ విషయంలో జగన్ , చంద్రబాబు దొందు దొందే అన్నట్లే వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబూ సరెండర్ అయ్యారా ?
చంద్రబాబు కూడా నరేంద్రమోడికి సరెండర్ అయిపోయినట్లే కనిపిస్తోంది. ఎన్డీఏలో ఉన్నంత కాలం రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు గాలికొదిలేశారన్నది వాస్తవం. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే హటాత్తుగా ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేశారు. బయటకు వచ్చేసిన తర్వాత నికార్సైన ప్రతిపక్షంగా వ్యవహరించారా అంటే లేదనే చెప్పాలి. పైకి ఆరోపణలు చేస్తూనే లోపల మాత్రం లోపాయికార ఒప్పందాలు చేసుకున్నారని వైసిపి చేస్తున్న ఆరోపణలు నిజమనేట్లు వ్యవహరిస్తున్నారు. కారణాలేంటంటే ఇక్కడ కూడా చంద్రబాబుపై ఉన్న కేసులే అని స్పష్టమవుతోంది. అంటే ఇటు ముఖ్యమంత్రి అటు ప్రధాన ప్రతిపక్ష నేత ఇద్దరిపై ఉన్న కేసుల వల్లే నరేంద్రమోడికి సరెండర్ అయిపోయారని జనాలు అనుకుంటే అది వారి తప్పు ఎంతమాత్రం కాదు.