ఈనెల 17 వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశంలో ఓ విచిత్రం చోటు చేసుకోబోతున్నది. అందులో మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడలు లేకుండానే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 17వ లోక్సభ తొలి సమావేశాలు జూన్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 5న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
భారత్కు 11వ ప్రధానిగా పనిచేసిన జేడీఎస్ నేత దేవెగౌడ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. గతంలో కర్ణాటకలోని హసన్ లోక్సభ నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలిచిన దేవెగౌడ.. ఈ సారి మనవడు ప్రజ్వల్ రేవణ్న కోసం తన సీటును త్యాగం చేశారు. తుముకూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దేవెగౌడ.. భాజపా అభ్యర్థి బసవరాజ్ చేతిలో 13వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. దీంతో ఈ సారి ఆయన పార్లమెంట్కు వెళ్లలేకపోయారు.
దాదాపు 30ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మన్మోహన్ సింగ్ పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. దీంతో రానున్న బడ్జెట్ సమావేశాలకు ఆయన దూరం కావాల్సి వచ్చింది. మన్మోహన్ తొలిసారిగా 1991లో అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
కానీ, ఈసారి ఆ ఛాన్స్ లేకపోవడంతో.. అస్సాం నుంచి ఎంపిక కాలేకపోయారు. దేశంలోని కాంగ్రెస్ కు పట్టున్న స్థానాల నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, మన్మోహన్ సింగ్ కు ఎప్పుడు అవకాశం వస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.