మొత్తం 545 ఎంపీ స్థానాలకు 353 మంది ఎన్డీఏ సభ్యులను గెలిపించుకొని తిరిగి రెండో దఫా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారం చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో లోక్సభలో ఎన్డీయేకి 353 మంది సభ్యులతో కూడిన సాధారణ మెజారిటీ ఉంది. కానీ 245 మంది సభ్యులున్న రాజ్యసభలోనే మోదీకి అసలైన సవాల్ ఎదురు కానుందని అంటున్నారు. ఎందుకంటే రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి 102 మంది ఎంపీలే ఉన్నారు. రాజ్యసభలో ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాలంటే ప్రభుత్వానికి అన్ని పార్టీలు… ముఖ్యంగా విపక్షాల మద్దతు అవసరం. ఈ సభలో ప్రభుత్వం ఇంకా మైనారిటీలోనే ఉన్న నేపథ్యంలో... మోదీ అక్కడ ఎలా నెగ్గుకొస్తారా అని పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాజ్యసభలో మద్దతు లేకపోవడం వల్లే...త్రిపుల్ తలాక్ వంటి అత్యంత ముఖ్యమైన బిల్లుల ఆమోదం పొందలేదు. గత ఎగువ సభలో ఈ బిల్లును ప్రతిపక్షంతో బాటు బీజేపీ మిత్ర పక్షమైన జేడీ-యు కూడా వ్యతిరేకించింది. ఈ బిల్లులో పలు సవరణలు చేయాలని కోరింది. దీన్ని పార్లమెంట్ సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా రాజ్యసభలో ఉన్న సమస్యల నేపథ్యంలో....తాజాగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశం పరిష్కార మార్గాలు వెతికే ప్రయత్నం చేసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ఢిల్లీలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిల పక్ష భేటీకి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషీ, అర్జున్ రామ్ మేఘవల్, రాజ్ నాథ్ సింగ్, సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓ బ్రెన్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం ప్రధాని మోదీ స్పందిస్తూ...అఖిలపక్షం ఫలవంతంగా ముగిసిందని తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిది, జరిగిన ఈ భేటీకి హాజరైన నేతలంతా విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని మోదీ ట్వీట్ చేశారు. ప్రజల ఆశలు తీర్చేలా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చూసేందుకు వీరంతా అంగీకరించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.