తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కొత్త పధకాలు ప్రవేశపెట్టి ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. అప్పట్లో అమ్మ జయలలిత ప్రవేశపెట్టిన పధకాలను అమలు చేస్తూనే.. కొత్త పథకాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పళనిస్వామి మరో కొత్త ఆలోచనలతో ప్రజలముందుకు వచ్చారు.
రాష్ట్రంలో పెద్ద జిల్లాల్లో ఒకటి వేలూరు. ఈ వేలూరు జిల్లాను మూడు భాగాలుగా విభజించారు. రాణిపేట, తిరప్పత్తురు, వేలూరుగా విభజించారు. ఈ మూడు జిల్లాలతో కలిపి ఇప్పుడు ఆ రాష్ట్రంలో మొత్తం 37 జిల్లాలు ఉన్నాయి. ఈ మూడు జిల్లాల ప్రక్రియ వెంటనే అమలులోకి వస్తుందని ప్రకటించారు. ప్రజల డిమాండ్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
వేలూరు జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. మూడు కొత్తజిల్లాలు ఏర్పాటు కావడంతో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. ఇదిలా ఉంటె, వీటితో పాటు స్వాతంత్ర దినోత్సవ కానుకగా పళనిస్వామి స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే పెన్షన్ ను మరింత పెంచారు. స్వాతంత్ర సమరయోధులకు ఇప్పటి వరకు నెలకు 15వేల రూపాయలను భృతిగా ఇస్తున్నారు. ఇకపై అది 16వేలకు పెరగనుంది. అలానే, స్వాతంత్ర సమరయోధుల చట్టబద్ధమైన వారసులకు పెన్షన్ ను రూ.7,500 నుంచి రూ.8,000కు పెంచుతున్నామని తెలిపారు.
ఇక్కడ తెలియాల్సిన అంశం ఏమిటంటే.. పళనిస్వామి ఉన్నపళంగా ఎందుకు ఇలా మూడు జిల్లాలను చేయాల్సి వచ్చిందో అర్ధంకాని విషయం. కాశ్మీర్ లో బీజేపీ చేసిన విధంగానే ఇక్కడ పళనిస్వామి కూడా చేయబోతున్నాడా..? అక్కడ రాష్ట్రాన్ని విభజిస్తే.. ఇక్కడ పళనిస్వామి జిల్లాలను విభజించి బీజేపీపై ఉన్న తన భక్తిని చాటుకుంటున్నాడా చూద్దాం. ఇటీవలే జరిగిన ఉపఎన్నికల్లో అన్నా డీఎంకే పరాజయం పాలైంది. వచ్చే ఎన్నికల్లో డీఎంకే గెలుస్తుందన్నది అనుమానమే. గెలిచినా గెలవకపోయినా.. తాము చేయాలనుకున్నది చేస్తామని, ప్రజల విషయంలో ఎప్పుడు మంచి చేయడానికే ఆలోచిస్తామని పళనిస్వామి అంటున్నాడు.